ముంబై, సెప్టెంబర్ 30: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నిబంధనల్ని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కఠినతరం చేసింది. గతంలో జరిగిన లావాదేవీలు, మదుపరుల నుంచి నిధుల సమీకరణలకు సంబంధించిన ఆఫర్ ధర ఆధారిత సమాచారాన్ని ప్రకటించాలని శుక్రవారం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇక్కడ జరిగిన బోర్డు సమావేశంలో ప్రతిపాదనలన్నింటికీ ఆమోద ముద్ర పడింది. ఇక ఇన్సైడర్ ట్రేడింగ్ రూల్స్ పరిధిలోకి క్రయవిక్రయాల మ్యూచువల్ ఫండ్ యూనిట్లను తెచ్చేందుకూ సెబీ బోర్డు అనుమతినిచ్చింది. అలాగే ఐపీవోకు రావాలని చూస్తున్న కంపెనీల కోసం ఆఫర్ డాక్యుమెంట్ల ‘ప్రీ-ఫైలింగ్’కు అనుమతించే ఓ ప్రత్యామ్నాయ వ్యవస్థ పరిచయ ప్రతిపాదనకూ గ్రీన్సిగ్నల్ వచ్చింది.
మదుపరుల ప్రయోజనాల రక్షణార్థం మ్యూచువల్ ఫండ్ సబ్స్క్రిప్షన్ లావాదేవీల కోసం టు-ఫ్యాక్టర్ అథెంటికేషన్ను సెబీ పొడిగించింది
పోర్ట్ఫోలియో మేనేజర్ల కోసం విధివిధానాల విడుదల
స్వతంత్ర డైరెక్టర్ల తొలగింపు, నియామకాల కోసం కొత్త అవకాశానికి ఆమోదం తెలిపిన సెబీ
ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)ను మరింత సౌకర్యవంతం చేస్తూ నిబంధనల సవరణ
శారదా గ్రూప్ ఆస్తుల అమ్మకానికి..
నవంబర్ 1న శారదా గ్రూప్ సంస్థల ఆస్తుల వేలానికి సెబీ సిద్ధమవుతున్నది. రూ.30 కోట్ల రిజర్వ్ ధరతో 69 ఆస్తులను అమ్మకానికి తేనున్నది. అక్రమ పథకాల ద్వారా శారదా గ్రూప్ మదుపరుల నుంచి నిధుల సమీకరణ చేపట్టిందని సెబీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే ఆస్తుల అమ్మకం ద్వారా సదరు మొత్తాలను తిరిగి సేకరించాలని సెబీ అనుకుంటున్నది. ఇదిలావుంటే సెక్యూరిటీ మార్కెట్లలో అన్ఆథరైజ్డ్ అడ్వైజరీ సేవల నుంచి నిషేధం విధిస్తూ రెండు సంస్థలు, ఇద్దరిపై సెబీ నిర్ణయం తీసుకున్నది. మహంకాళ్ క్యాపిటల్, దాని యజమాని అజయ్ థాకూర్తోపాటు మనీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, దాని అధిపతి విజయ్ థాకూర్లపై సెబీ వేటు వేసింది.