NSE Chitra Secrets | నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ వింతలు.. విచిత్రాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. 20 ఏండ్లుగా వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తిపరంగా ఓ నిరాకార యోగి ప్రభావానికి గురైన చిత్రా రామకృష్ణ తన కెరీర్ అంతా వివాదాస్పదంగా వ్యవహరించారని ఆమె పనితీరుపై సెబీ వెల్లడించిన 190 పేజీల దర్యాప్తు నివేదిక చెబుతున్నది. ఎస్ఎస్ఈ సెల్ఫ్ లిస్టింగ్కు అనుమతి తెచ్చుకోవడంపైనా చిత్రకు సదరు హిమాలయ యోగి సలహా ఇచ్చారని తేలింది.
2015 డిసెంబర్ నాలుగో తేదీన ఎన్ఎస్ఈ సెల్ఫ్ లిస్టింగ్పై అనుసరించాల్సిన వ్యూహంపై ఈ నిరాకార యోగి నుంచి చిత్ర రామకృష్ణకు సలహా ఇచ్చినట్లు నాటి ఈ-మెయిల్ చెబుతున్నది. ‘మనం ఏదైనా తలపెడితే.. దాని ఎజెండాపై నిత్యం ఆలోచించుకోవాలి. ఎన్ఎస్ఈ సెల్ఫ్ లిస్టింగ్ కోసం అవసరమైతే కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయ (పీఎంవో) అధికారి, క్యాబినెట్ కార్యదర్శి, ఆర్థిక సలహాదారు, చివరకు ప్రధాని ఇంటికీ వెళ్లాలి. దీనిపై ఆందోళనొద్దు. నా ఆదేశాల ప్రకారం కంచన్ (ఆనంద్ సుబ్రమణ్యం) నడుచుకుంటాడు. ఎప్పుడేం చేయాలో కంచన్కు చెబుతా.. అతడు చేస్తాడు. ఆందోళన చెందకు’ అని ఆ ఈ-మెయిల్లో చిత్రా రామకృష్ణకు హిమాలయ యోగి చేసిన సూచన.
ఎన్ఎస్ఈ సెల్ఫ్ లిస్టింగ్పైన ఆర్థికశాఖ కూడా ఒత్తిడి తెస్తుందని సెబీని నమ్మించు. తర్వాత ఏం జరుగుతుందో చూడు.. ఎంజాయ్ అని కూడా యోగి సూచించాడని సెబీ గుర్తించింది. దీంతో ఎన్ఎస్ఈ నిర్వహణలో కీలక అంశాలపై సదరు సిద్ధపురుషుడైన యోగిపై ఆధారపడి చిత్ర రామకృష్ణ ఆధార పడ్డారో అర్థం అవుతుందని సెబీ తెలిపింది. ఆయన వల్లే అర్హత లేని ఆనంద్ సుబ్రమణ్యాన్ని ఎక్స్చేంజ్లో చీఫ్ స్ట్రాటర్జిక్ అడ్వైజర్గా, తన సలహాదారుగా చిత్ర రామకృష్ణ నియమించుకున్నారు.
2016 మేలో సెల్ఫ్ లిస్టింగ్ ప్రతిపాదనను చిత్రా రామకృష్ణ టీం పంపినా సెబీ తిరస్కరించింది. చిత్ర రాజీనామా చేసిన కొన్ని వారాలకు లిస్టింగ్ వ్యవహారం మళ్లీ తెరమీదికొచ్చింది. 2016 డిసెంబర్లో రూ.10 వేల కోట్ల నిధుల సేకరణకు ఐపీవోకు వెళ్లేందుకు అనుమతించాలని సెబీకి దరఖాస్తు చేసింది. కానీ కో లొకేషన్ కుంభకోణం, ఇతర ఆర్థిక అవకతవకల వల్ల ఐపీవో దరఖాస్తును విత్డ్రా చేసుకోవాలని ఎన్ఎస్ఈకి సెబీ సూచించింది.
చిత్రా రామకృష్ణ పనితీరుపై పెను ప్రభావం చూపిన సదరు హిమాలయ యోగి ఎవరన్నది అంతు చిక్కకుండా ఉంది. ఈ పరిణామాలన్నీ యోగి-ఆనంద్ సుబ్రమణ్యం ఒక్కరేనని సెబీ, సీబీఐ అనుమానిస్తున్నాయి. కానీ వారిద్దరూ ఒక్కరు కాదని చిత్రా రామకృష్ణ పేర్కొన్నారు. కో-లొకేషన్లో సీబీఐ ప్రశ్నించినప్పుడూ సెబీకి ఇచ్చిన జవాబులే ఇచ్చారు. ఆ వ్యక్తి ఆనంద్ కాదని, అతడికి భౌతిక రూపమేదీ లేదని చెప్పారు.