Demat A/C Nomination | వివిధ సంస్థల ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలన్నా.. మ్యూచువల్ ఫండ్స్లో నిధులు మదుపు చేయాలన్నా.. డీమ్యాట్ ఖాతాలు తీసుకోవాల్సిందే. ఇంతకుముందు నిధులు మదుపు చేసిన మ్యూచువల్ ఫండ్స్ ఖాతాలకు నామినీలను ఖరారు చేసిన స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’.. డీమ్యాట్ ఖాతాల్లోనూ నామినీ పేర్లు తప్పనిసరి నమోదు చేయాలని నిర్ణయించింది. ఇందుకు డీమ్యాట్ ఖాతాదారులకు ఇచ్చిన గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నది.
గడువు దగ్గర పడుతుండటంతో డీమ్యాట్ ఖాతాదారులకు నామినేషన్ గడువు మరో మూడు నెలలు పొడిగించింది. అంటే 2023 డిసెంబర్ నెలాఖరు వరకూ డీమ్యాట్ ఖాతాదారులకు నామినేషన్ గడువు పొడిగించినట్లయింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కోసం డీమ్యాట్ ఖాతాలకు ఖాతాదారులు స్వచ్ఛందంగా నామినీల పేరు చేర్చాలని మంగళవారం సెబీ జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొంది.
పలువురు వ్యక్తులు డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించినప్పుడు నామినీ పేరు వెల్లడించరు. పెట్టుబడి పెట్టిన వ్యక్తులు అనుకోనిది జరిగితే ఖాతాల్లో ఉన్న పెట్టుబడులపై వారసులు క్లయిమ్ చేసుకోవడం కష్టతరంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో నామినీ వివరాలు వెల్లడించాలని డీమ్యాట్ ఖాతాదారులకు సెబీ సూచించింది. తొలుత గతేడాది మార్చి నెలాఖరు వరకూ గడువు ఇచ్చిన సెబీ.. పలు దఫాలుగా గడువు పొడిగిస్తూ వచ్చింది. తాజాగా 2023డిసెంబర్ నెలాఖరు వరకూ పొడిగించింది.
సెబీ నిర్దేశించిన గడువులోగా డీమ్యాట్ ఖాతాదారులు.. తమ అకౌంట్లకు నామినీల పేర్లు చేర్చాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు, తోబుట్టువుల్లో ఎవరినైనా నామినీగా చేర్చాల్సి ఉంటుంది. నామినీని చేర్చడం ఇష్టం లేకుంటే ఆ విషయం కూడా సెబీకి తెలియ జేయాల్సి ఉంటుంది.