న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన సంస్థల్లో సీఎండీ హోదా విభజనపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వెనక్కి తగ్గింది. చైర్మన్ లేదా చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ లేదా సీఈవో పదవులు ఒక్కరి వద్దే ఉండొద్దన్నది తప్పనిసరేమీ కాదని, ఆయా సంస్థల ఇష్టమని, ఈ విషయంలో స్వచ్చంధంగా నిర్ణయం తీసుకోవచ్చని మంగళవారం సెబీ స్పష్టం చేసింది. సీఎండీ ఒక్కరే ఉంటారా?.. లేక చైర్మన్ ఒకరు, ఎండీ/సీఈవోగా మరొకరు ఉంటారా?.. అన్నది ఆయా సంస్థల ఇష్టమేనని ప్రకటించింది. స్టాక్ మార్కెట్లలో లిైస్టెన టాప్-500 సంస్థల్లో సీఎండీ పదవి విభజన ఈ ఏడాది ఏప్రిల్లోగా పూర్తికావాలని సెబీ డెడ్లైన్ పెట్టిన విషయం తెలిసిందే. నిజానికి 2020 ఏప్రిల్ 1లోగానే ఈ విభజన పూర్తవ్వాలని సెబీ గతంలో గడువు పెట్టింది. అయితే కంపెనీ ప్రతినిధుల విజ్ఞప్తి, మరింత సమయం కావాలని కోరడంతో పెంచారు. ఇప్పుడు దీన్ని తప్పనిసరేమీ కాదని ప్రకటించింది. ఇదిలావుంటే దేశీయ కంపెనీలు ఒకవేళ ఈ అంశంపై ఏదైనా అభిప్రాయాన్ని కలిగిఉంటే సెబీ దాన్ని తప్పక పరిశీలించాలని, నేనైతే ఇందుకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో సెబీ తాజా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
కొత్త సంస్కరణలు తేవాలి
దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేయడానికి తర్వాతి తరం కొత్త సంస్కరణలను తీసుకురావాలని సెబీకి నిర్మలా సీతారామన్ సూచించారు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలతో దేశీయ మార్కెట్లలో ఏర్పడే అలజడిపట్ల అప్రమత్తంగా ఉండాలని, దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలన్నారు. మంగళవారం సెబీ బోర్డునుద్దేశించి మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇప్పటికే తీసుకున్న పలు సెబీ నిర్ణయాలను కొనియాడారు.