హైదరాబాద్, సెప్టెంబర్ 19: కొత్త ఇండ్లకు గిరాకీ కొనసాగుతున్నది. హైదరాబాద్లో నూతన నిర్మాణాలు పెరిగినట్టు స్కేర్ యార్డ్స్ తెలియజేసింది. ఈ ఏడాది రెండో త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను తాజా నివేదికను స్కేర్ యార్డ్స్ విడుదల చేసింది. ఇందులో తొలి త్రైమాసికం (జనవరి-మార్చి) తరహాలోనే హౌజింగ్ రంగం ఏప్రిల్-జూన్లోనూ పరుగులు పెట్టినట్టు తేలింది. కాగా, దేశవ్యాప్తంగా హైదరాబాద్సహా 6 నగరాల్లో స్కేర్ యార్డ్స్ సర్వే చేసింది. హైదరాబాద్, ముంబై ఎంఎంఆర్, పుణె, నోయిడా, గురుగ్రామ్, బెంగళూరు నగరాల్లోని రియల్టీ రంగ పోకడను ఇందులో విశ్లేషించింది.
ప్రతికూల పరిస్థితుల్లోనూ..
ప్రతికూల పరిస్థితులు ఎదురైనా హైదరాబాద్, ఆయా నగరాల్లో ఏప్రిల్-జూన్ వ్యవధిలో కొత్త నివాసాల ప్రారంభం నిరుడు ఇదే కాలంతో చూస్తే 170 శాతం పెరిగినట్టు స్కేర్ యార్డ్స్ స్పష్టం చేసింది. 79వేల కొత్త హౌజింగ్ యూనిట్లు మొదలైనట్టు పేర్కొన్నది. ముంబై ఎంఎంఆర్, పుణె తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఉన్నట్టు వెల్లడించింది. ఇండ్ల ధరలు, వడ్డీరేట్లు పెరిగినా నూతన నిర్మాణాలపై పెద్దగా ప్రభావం చూపడం లేదన్న స్కేర్ యార్డ్స్.. 79వేల కొత్త యూనిట్లలో 20 శాతం హైదరాబాద్ వాటానేనని చెప్పింది. ఇదిలావుంటే రూ.30-60 లక్షలు, రూ.60-కోటి రూపాయల మధ్య ధర కలిగిన ఇండ్ల కోసమే చాలామంది వెతుకుతున్నట్టు ఈ సందర్భంగా తేలింది.
పండగ సీజన్ భేష్!
రాబోయే పండగ సీజన్లో ఇండ్ల అమ్మకాలు బాగుంటాయన్న ఆశాభావం నిర్మాణ రంగ వ్యాప్తంగా వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ డెవలపర్స్, బ్రోకరేజ్ సంస్థలు దశాబ్ద కాలంలోనే ఎప్పుడూ లేనంత వృద్ధిని చూడవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక టాటా, డీఎల్ఎఫ్, మహీంద్రా, టీఏఆర్సీ, కార్లే ఇన్ఫ్రా తదితర బడా సంస్థలు పండగ ఆఫర్లనూ కొనుగోలుదారుల కోసం సిద్ధం చేస్తున్నాయి. మరోవైపు నిర్మాణ వ్యయం, వడ్డీరేట్లు పెరిగినా ఇండ్ల కొనుగోళ్లు తగ్గడం లేదంటున్న పరిశ్రమ నిపుణులు.. కరోనా తదనంతర పరిస్థితుల్లో దీన్ని శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు.