ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఓ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)ను అందిస్తున్నది. ఎస్బీఐ వుయ్కేర్ పేరుతో వచ్చిన ఈ ఎఫ్డీ కాలపరిమితి 5-10 ఏండ్లుగా ఉన్నది. కొత్త డిపాజిట్లతోపాటు కాలపరిమితి తీరిన పాత డిపాజిట్ల రెన్యువల్కూ ఈ స్కీం అందుబాటులో ఉంటుంది. ఇందులో చేరేందుకున్న గడువు ఈ నెలాఖరే. ఇతర ఎఫ్డీలతో పోల్చితే ఇందులో వడ్డీరేటు ఆకర్షణీయంగా ఉండటం విశేషం. పెద్ద ఎత్తున డిపాజిట్లు చేసేవారికీ ఈ స్కీం అనువుగా ఉండటం మరింత కలిసొచ్చే అంశం. నిజానికి మార్కెట్ రిస్క్ లేకపోవడం, సురక్షిత పెట్టుబడి సాధనం కూడా కావడంతో ఇటీవలికాలంలో ఫిక్స్డ్ డిపాజిట్లకు ఆదరణ పెరుగుతున్నది.
ఈ ప్రత్యేక ఎఫ్డీపై ఎస్బీఐ 7.50 శాతం వడ్డీరేటును చెల్లిస్తున్నది. కాగా, మిగతా ఎఫ్డీల విషయానికొస్తే.. ఎస్బీఐ అమృత్ కలశ్ ప్రత్యేక డిపాజిట్ స్కీంలో సీనియర్ సిటిజన్లకు 400 రోజుల కాలపరిమితిపై 7.60 శాతం వడ్డీరేటు వస్తున్నది. దీనిలో చేరేందుకు కూడా గడువు ఈ మార్చి 31 మాత్రమే. ఇక 1111 రోజుల నుంచి 1777 రోజుల గ్రీన్ డిపాజిట్లపై 7.15 శాతం, 2222 రోజుల డిపాజిట్లపై 7.40 శాతం వడ్డీరేటు అందుతున్నది. రెండేండ్ల కాలపరిమితితో ఉన్న ఎస్బీఐ సర్వోత్తమ్ టర్మ్ డిపాజిట్లపై 7.9 శాతం వడ్డీరేటు వస్తున్నది. ఏడాది డిపాజిట్కు మాత్రం 7.60 శాతం వడ్డీరేటు వర్తిస్తున్నది.