SBI Alert | కేవైసీ మోసాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ తన ఖాతాదారులకు అలర్ట్ జారీ చేసింది. ఇటీవల ఆన్లైన్లో ఎక్కువ మోసాలు జరుగుతుండటం. వారిలో ఎస్బీఐ ఖాతాదారులు సైబర్ నేరగాళ్ల బారిన పడుతుండటంతో బ్యాంకు పై విధంగా హెచ్చరికలు జారీ చేసింది. కేవైసీ ధృవీకరణ పేరిట సైబర్ మోసగాళ్లు తమ కస్టమర్లకు వల విసురుతున్నారని పేర్కొంది. కనుక తమ ఖాతాదారులు బ్యాంకింగ్ లావాదేవీలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని హితవు చెప్పింది.
ఎస్బీఐ పేరిట ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా వచ్చే కేవైసీ అప్డేట్ లింక్స్ తెరవొద్దని హెచ్చరిస్తున్నాం. ఈ మోసాలపై http://cybercrime.gov.in అనే పోర్టల్కు ఫిర్యాదు చేయండంటూ ఎస్బీఐ ట్వీట్ చేసింది. కేవైసీ అప్డేట్ కోసం బ్యాంకులు ఎలాంటి లింక్స్ పంపవని పేర్కొంది. ఖాతాదారుల మొబైల్ నంబర్, ఖాతా వివరాలు, డెబిట్ కార్డ్ నంబర్, పిన్, ఓటీపీ తదితర సున్నిత వివరాలను ఎవరితోనూ చెప్పవద్దని స్పష్టం చేసింది. ఇటువంటి ఎస్సెమ్మెస్ మోసాల బారిన పడి మోసపోవద్దని ఖాతాదారులను హెచ్చరించింది.