SBI | ద్రవ్యోల్బణం నియంత్రణ కోసం గతేడాది పొడవునా వడ్డీరేట్లు పెరిగాయి. తత్ఫలితంగా వివిధ రకాల రుణాలు తీసుకున్న వారు పెరిగిన ఈఎంఐ భారంతో రుణాల చెల్లింపులకు ముందుకు రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కనీసం ఈఎంఐ చెల్లించాలని బ్యాంకు నుంచి చేసే రిమైండర్ కాల్స్కు కూడా వారు రిప్లయ్ ఇవ్వడం లేదని దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎస్బీఐ గుర్తించింది.
ఈ నేపథ్యంలో రుణ ఎగవేతకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్న వారి మనస్సు మార్చేందుకు ఎస్బీఐ వినూత్న పథకం చేపట్టింది. ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా వారి ఇండ్లకు వెళ్లి, చాక్లెట్లు ఇచ్చి మరీ ఈఎంఐ వాయిదా పే చేయాలని గుర్తు చేయాలని భావిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. రిటైల్ రుణాలు, వాటిపై వడ్డీ రేట్లు పెరుగుతుండటంతో వసూళ్లను పెంచుకునేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది.
ఇందుకోసం రెండు ఫిన్ టెక్ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నది ఎస్బీఐ. ఈ కొత్త పాలసీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని తెలిపింది. సదరు ఫిన్ టెక్ సంస్థలు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రుణ వాయిదా సమయం దగ్గర పడినప్పుడు సంబంధిత రుణ గ్రహీతలకు రిమైండర్లు పంపుతాయి. వాయిదా ఎగవేతకు పాల్పడే అవకాశం ఉన్న వారి వివరాలను సదరు ఫిన్ టెక్ సంస్థలు తమకు అందజేస్తాయని పేర్కొంది.
అలాగే ఆ సంస్థ ప్రతినిధులు కొందరు రుణ గ్రహీతల ఇంటికి వెళ్లి చాక్లెట్ ఇచ్చి మరీ ‘ఈఎంఐ’ వాయిదా సమయం గుర్తు చేస్తారని ఎస్బీఐ వివరించింది. 15 రోజులుగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతమైందని ఎస్బీఐ వివరించింది. ఇందుకోసం మరికొన్ని ఫిన్ టెక్ సంస్థలతోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. ఎస్బీఐ రిటైల్ రుణాలు గత జూన్ త్రైమాసికంలో రూ.10.34 లక్షల కోట్ల నుంచి 16.46 శాతం పెరిగి రూ.12.04 కోట్లకు పెరిగింది.