న్యూఢిల్లీ, మే 21: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రికార్డు స్థాయి ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.6,450.75 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం రికార్డు స్థాయి లాభాలు ఆర్జించడానికి ప్రధాన కారణమని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.3,580.81 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.76,027.51 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.81,326.96 కోట్లక ఎగబాకింది. కన్సాలిడేటెడ్ ఆధారంగా బ్యాంక్ నికర లాభం 60 శాతం ఎగబాకి రూ.7,270.25 కోట్లుగా ఉన్నది.