Outage on SBI | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం నుంచి దేశవ్యాప్తంగా బ్యాంక్ సేవల్లో అంతరాయం ఏర్పడిందని కస్టమర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నెట్ బ్యాంకింగ్, నిధుల బదిలీ, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ల విషయమై సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని బ్యాంక్ కస్టమర్లు ఫిర్యాదు చేస్తున్నారు. యూపీఐ చెల్లింపుల విషయంలో ఈ సమస్య తలెత్తినట్లు చెబుతున్నారు.
చివరకు ఎస్బీఐ ఏటీఎంలలోనూ నగదు విత్డ్రాయల్స్ జరుగడం లేదని అంటున్నారు. ఎస్బీఐ ఖాతాదారులు తమ యోనో యాప్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు బ్యాంకులో మెయింటెనెన్స్ పనుల వల్ల కస్టమర్లకు సేవలు అందించడంలో అంతరాయం ఏర్పడిందని మెసేజ్ వస్తున్నది.
నెలాఖరులో వేతన జీవుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు పడే వేళ అంతరాయం ఏర్పడటం పట్ల బ్యాంక్ ఖాతాదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.గురువారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి బ్యాంకింగ్ సేవల గురించి ఎస్బీఐ కస్టమర్లు ఫిర్యాదు చేస్తున్నట్లు డౌన్ డిటెక్టర్ తెలిపింది. కస్టమర్లకు బ్యాంకింగ్ సేవల పునరుద్ధరణపై ఎస్బీఐ ఇంకా స్పందించలేదు.