న్యూఢిల్లీ, ఆగస్టు 4: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ జూన్తో ముగిసిన త్రైమాసికంలో అంచనాల్ని మించిన ఫలితాల్ని ప్రకటించింది. దేశంలో అతిపెద్ద బ్యాంకైన ఎస్బీఐ గతంలో ఏ త్రైమాసికంలోనూ ఆర్జించనంతగా 2021 ఏప్రిల్-జూన్ మధ్యకాలానికి రికార్డుస్థాయిలో రూ.6,504 కోట్ల నికరలాభాన్ని సాధించింది. గతేడాది ఇదేకాలంలో ఆర్జించిన రూ.4,189 కోట్లకంటే ఈ జూన్లో 55 శాతం వృద్ధిని కనపర్చింది. మొండి బకాయిలు తగ్గడంతో ఈ ఫీట్ సాధ్యపడింది. స్టాండెలోన్ ప్రాతిపాదికన మొత్తం ఆదాయం రూ.74,458 కోట్ల నుంచి రూ.77,347 కోట్లకు పెరిగినట్లు బుధవారం డైరెక్టర్ల బోర్డు సమావేశం అనంతరం బ్యాంకు వెల్లడించింది. నిర్వహణా లాభం రూ.18,061 కోట్ల నుంచి రూ.18,975 కోట్లకు చేరింది. అయితే నికర వడ్డీ ఆదాయం మాత్రం రూ.66,500 కోట్ల నుంచి రూ.65,564 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ మార్జిన్ కూడా 3.24 శాతం నుంచి 3.15 శాతానికి దిగివచ్చింది. బ్యాంకు మొత్తం ఆస్తుల్లో స్థూల నిరర్ధక ఆస్తులు (మొండి బకాయిలు, ఎన్పీఏ) 5.44 శాతం నుంచి 5.32 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ 1.8 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.9,420 కోట్ల నుంచి రూ.5,030 కోట్లకు తగ్గాయి. జూన్ క్వార్టర్లో రూ.15,666 కోట్ల రుణాలు ఎన్పీఏలుకాగా, అందులో రూ.5,246 కోట్ల విలువైన రుణాల్ని రిజర్వుబ్యాంకు మార్గదర్శకాల ప్రకారం పునర్వ్యవస్థీకరించినట్లు ఎస్బీఐ తెలిపింది. బ్యాంకు క్యాపిటల్ అడిక్వసీ రేషియో 13.66 శాతానికి మెరుగుపడింది. ఇక కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంకు నికరలాభం రూ.4,776 కోట్ల నుంచి రూ.7,379 కోట్లకు పెరగ్గా, ఆదాయం రూ.87,984 కోట్ల నుంచి రూ.93,267 కోట్లకు చేరింది.
బ్యాంకుల రుణాలు ఎగవేసి, విదేశాలకు ఉడాయించిన పారిశ్రామికవేత్త విజయ్మౌల్యకు చెందిన కింగ్ఫిషర్ బకాయిల్లో రూ.1,692 కోట్లు రికవరీ చేసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది. షేర్లను విక్రయించడం ద్వారా ఈ రికవరీ జరిగింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గృహరుణాలకు సంబంధించిన మొండి బకాయిలు ఈ జూన్ క్వార్టర్లో పెరిగినట్లు బ్యాంక్ చైర్మన్ దినేష్ ఖారా మీడియాతో చెప్పారు. తమ మొత్తం రుణాల్లో ఇవి 1.39 శాతమని, కొవిడ్ సంక్షోభంతో లాక్డౌన్లు, ఆర్థిక వ్యవస్థ మందగించడం వంటి అసాధారణ సందర్భంలో ఈ బకాయిలు పెరిగాయని, అయితే జూలైలో రికవరీలు బావున్నాయని ఆయన వివరించారు. మున్ముందు ఈ బకాయిలు తగ్గుతాయన్న ఆశాభావాన్ని ఖారా వ్యక్తంచేశారు. ఎంఎస్ఎంఈ, గృహ రుణాల పుస్తకాల్లో 30-90 రోజుల ఎన్పీఏలు రూ.11,303 కోట్లని, వీటి నుంచి జూలై నెలలో రూ.4,700 కోట్లు వసూలైనట్లు ఆయన చెప్పారు.