ముంబై: కొవిడ్-19 బారిన పడిన రోగులకు అండగా నిలిచేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ముందుకు వచ్చింది. భారీ స్థాయిలో ఖర్చు చేసేందుకు అత్యవసరంగా నిధులు అందుబాటులో లేని వారికి పర్సనల్ లోన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ రుణానికి ‘కవచ్’ అని పేరు పెట్టింది.
కొవిడ్ బారిన పడిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులకు ఈ లోన్ అందుబాటులో ఉంటుంది. గరిష్ఠంగా రూ5. లక్షల వరకు ఎటువంటి పూచీకత్తు లేకుండానే రుణం మంజూరు చేస్తుంది. దీనిపై 8.5 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యుల చికిత్స ఖర్చుకు ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చునన్నది.
ఈ రుణం చెల్లింపునకు 60 నెలల గడువు ఉంటుంది. ఈ గడువులోనే మూడు నెలల మారటోరియం ఇస్తున్నట్లు ఎస్బీఐ ఛైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు. కోవిడ్ రోగులను ఆదుకునేందుకు పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తున్నందుకు తమకు సంతోషంగా ఉందన్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న పర్సనల్ రుణాలతో పోలిస్తే దీనిపై చౌక వడ్డీ వసూలు చేస్తున్నామని ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. కష్టాల్లో ఉన్న తమ ఖాతాదారులను ఆదుకునేందుకు ఈ రుణం అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది. దీంతో అన్ని రకాల కోవిడ్-19 నివారణ ఖర్చులు తీర్చుకోవచ్చు.
వ్యూహాత్మకంగా అమలు చేస్తున్న ఈ రుణంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న తమ కస్టమర్లకు ద్రవ్య లభ్యత కల్పించడమే తమ లక్ష్యం అని దినేశ్ ఖారా చెప్పారు. తమ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఆర్థిక పరిష్కారాలు చూపడానికి నిరంతరం క్రుషి చేస్తున్నట్లు తెలిపారు.