SBI | దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ తన ఖాతాదారులకు అలర్ట్ జారీ చేసింది. శనివారం రాత్రి 11.30 గంటల నుంచి కొన్ని గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలతో పాటు యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు సైతం నిలిచిపోతాయని బ్యాంక్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. శనివారం అర్ధరాత్రి 11.30 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు ఈ సేవలు నిలిచిపోనున్నాయి.
టెక్నాలజీ అప్గ్రెడేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడుతున్నదని ఎస్బీఐ పేర్కొన్నది. మెరుగైన బ్యాంకింగ్ సేవలందించే ప్రయత్నంలో కలుగుతున్న ఈ అసౌకర్యానికి సహకరించాలని ఎస్బీఐ తన ఖాతాదారులను కోరింది. ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 22వేల శాఖలు, 57,889 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. గత అక్టోబర్ 8వ తేదీన సైతం ఇదే తరహాలో మెయింటెనెన్స్ పన్నుల్లో భాగంగా ఎస్బీఐ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది.