న్యూఢిల్లీ, మే 16: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహితలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్లు లేదా 0.1 శాతం పెంచింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో రుణ గ్రహితల నెలవారి చెల్లింపులు అధికమవనున్నాయి. పెరిగిన వడ్డీరేట్లు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. ఒక్క నెలలో వడ్డీరేట్లను పెంచడం ఇది రెండోసారి. రిజర్వు బ్యాంక్ రెపోరేటును 0.40 శాతం పెంచడంతో పలు బ్యాంక్లు వడ్డీరేట్లను క్రమంగా పెంచుతున్నాయి. దీంతో ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటు మరింత అధికమవనున్నది. ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ రేటు 7.10 శాతం నుంచి 7.20 శాతానికి చేరుకోగా, ఒక్కరోజు, నెల, మూడు నెలల రుణాలపై వడ్డీరేటు 6.85 శాతానికి, ఆరు నెలల రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 7.15 శాతానికి చేరుకోనున్నది. దీంతోపాటు రెండేండ్ల కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ రేటు 7.40 శాతానికి, మూడేండ్ల రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 7.50 శాతానికి చేరుకోనున్నది. అలాగే ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ బేస్డ్ లెండింగ్ రేటు(ఈబీఎల్ఆర్) 6.65 శాతంగాను, రెపో-లింక్డ్ లెండింగ్ రేటు(ఆర్ఎల్ఎల్ఆర్) 6.25 శాతంగా ఉన్నాయి.