హైదరాబాద్, డిసెంబర్ 27: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్దారులకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీరేట్లను అర శాతం వరకు సవరించింది. ఎస్బీఐ వెబ్సైట్ సమాచారం ప్రకారం పెరిగిన వడ్డీరేట్లు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి. పది నెలల తర్వాత వడ్డీరేట్లను పెంచడం విశేషం. చివరిసారి ఫిబ్రవరి 2023లో డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించింది.
దీంతో 7 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్లు సవరించడంతో వడ్డీరేటు 3 శాతం నుంచి 3.50 శాతానికి చేరుకున్నది. అలాగే 46 నుంచి 179 రోజుల లోపు డిపాజిట్లపై వడ్డీరేటును పావు శాతం పెంచిన బ్యాంక్..180 నుంచి 210 రోజుల లోపు డిపాజిట్లపై రేటుని కూడా పావు శాతం సవరించింది.
ప్రతిష్ఠాత్మకంగా ఎస్బీఐ బ్యాంక్ జారీ చేసిన ఎస్బీఐ అమృత్ కలశ్ స్కీం కాలపరిమితిని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. 400 రోజుల కాలపరిమితి కలిగిన ప్రత్యేక డిపాజిట్ స్కీంపై 7.10 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది బ్యాంక్. అలాగే సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీని చెల్లిస్తున్నది.