SBI Loan Rates Rise | మీరు సొంతింటి కొనుగోలు కోసం గానీ.. వాహనం కొనుగోలు కోసం గానీ.. వ్యక్తిగత రుణం గానీ తీసుకుంటున్నారా.. అయితే వడ్డీరేట్లు పెరుగబోతున్నాయ్. దేశంలోనే కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్ ఎస్బీఐ.. రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) పెంచేస్తున్నట్లు ప్రకటించింది. ఆయా రుణాలపై పది బేసిక్ పాయింట్లు (బీపీఎస్) పెంచుతున్నట్లు తెలిపింది. ఈ నెల 15వ తేదీ నుంచే ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ రేట్ల పెరుగుదల అమల్లోకి వచ్చింది. దీంతో ఇల్లు, ఆటో, ఇతర రుణాలు కాస్ట్లీ కానున్నాయి.
ఓవర్నైట్, నెల, మూడు నెలలు, ఆరు నెలలకోసారి ఎంసీఎల్ఆర్ రేట్లు 10 బేసిక్ పాయింట్లు పెరుగుతాయని ఎస్బీఐ వెబ్సైట్ తెలిపింది. దీని ప్రకారం వడ్డీరేట్లు ఓవర్నైట్ నుంచి మూడు నెలల వరకు 6.65 నుంచి 6.75 శాతానికి పెరుగుతాయి. ఆరు నెలల టెన్యూర్ రుణాలపై వడ్డీరేటు 7.05 శాతం, ఏడాది గడువు గల రుణాలపై 7.10, రెండేండ్ల గడువు రుణాలపై 7.30, మూడేండ్ల వ్యవధి గల రుణాలపై 7.40 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
గతవారం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కూడా ఎంసీఎల్ఆర్ రేట్లు 0.05 శాతం పెంచి వేసింది. ఈ నెల 12 నుంచి పెంచిన ఎంసీఎల్ఆర్ రేట్లు అమల్లోకి వచ్చినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది.
ఎంసీఎల్ఆర్ అంటే..?
ఎంసీఎల్ఆర్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్). ఆర్బీఐ నూతన నిబంధనల ప్రకారం కమర్షియల్ బ్యాంకులు తాము మంజూరు చేసే వివిధ రకాల రుణాలపై వడ్డీరేట్లు పెంచుకోవచ్చు. బ్యాంకులు తమ నిధుల లభ్యత, వాటిని సమీకరించడానికి అయ్యే ఖర్చులు గణించి రుణాలపై విధించే వడ్డీరేటును ఖరారు చేస్తాయి. ఇక నుంచి రుణాలు తీసుకోవడానికి వచ్చే వారికి ఎంసీఎల్ఆర్ ఆధారంగా వడ్డీరేట్లు పెరుగుతాయి. హోంలోన్ రీసెట్ గడువు తేదీ వచ్చాక ఎంసీఎల్ఆర్ ప్రకారం వారి నెలవారీ ఈఎంఐ చెల్లింపుల మొత్తం పెరుగుతాయి. ఈ నెల 8న ప్రకటించిన ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.