న్యూఢిల్లీ: లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ).. లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్.. అంటే టక్కున గుర్తుకు వచ్చేది పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం. ముంబైలోని ఒక పీఎన్బీ శాఖ నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్స్ తీసుకున్న నీరవ్ మోదీ.. ఆయన మేనమామ మెహుల్ చోక్సీ దాదాపు రూ.13,500 కోట్ల మేరకు మోసం చేశారు. స్కాం వెలుగు చూసే సమయానికి దేశం విడిచి పారిపోయారు.
లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే సంబంధిత బ్యాంకర్ నుంచి వ్యాపార సంస్థలకు ఇచ్చే గ్యారంటీ పత్రం.. ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ తీసుకున్న కొనుగోలు దారు సరైన టైంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు లెటర్ ఆఫ్ క్రెడిట్ ప్రక్రియ నెమ్మదిగా సాగింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం మాదిరిగా లెటర్ ఆఫ్ క్రెడిట్లో మోసాల నియంత్రణకు భౌతికంగా బ్యాంకు ఉద్యోగులు జోక్యం చేసుకోవాల్సి వచ్చేది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎంతో ఉపకరించనున్నది.
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీని అందుబాటులోకి తేనున్నాయి. ఇందుకోసం ఇండియన్ బ్యాంక్స్ బ్లాక్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఐబీబీఐసీ)ని ఏర్పాటు చేశాయి.
దీంతోపాటు జీఎస్టీ ఇన్వాయిస్లు, ఈ-వే బిల్లుల ప్రాసెసింగ్ ఇప్పటివరకు సంప్రదాయ పద్దతుల్లో జరిగేది. కానీ ప్రస్తుతం ఆచరణలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో వీటిని పరిష్కరించడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపకరించనున్నది.
అంతే కాదు.. పేపర్ వర్క్కు ఉద్వాసన, లావాదేవీల ట్రాన్సాక్షన్ టైం తగ్గింపు, భద్రతతో కూడిన వాతావరణం నెలకొల్పేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించాలని నిర్ణయించాయి.
బ్యాంకులు తీసుకున్న ఈ నిర్ణయం చిన్న-మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు వరంగా మారనున్నది. అన్ని రకాల లావాదేవీల త్వరితగతిన పూర్తి కావడంతోపాటు ఫ్రాడ్ కనీస స్థాయికి తీసుకొస్తారు.
ఈ వ్యవస్థ అమలులోకి రావడానికి ఏడాది పడుతుందని భావిస్తున్నారు. ఐబీబీఐసీలో సభ్య బ్యాంకులకు 6.66 శాతం వాటా ఉంటుంది. ఈ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) మాదిరే వ్యవహరిస్తుంది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్తో సహా 12 బ్యాంకులు ఈ వ్యవస్థలో భాగస్వామ్యం కానున్నాయి. 2008లో తొలిసారి ఈ ప్రతిపాదన పురుడు పోసుకున్నది. దీంతో ఇన్ఫోసిస్ ఫినాకెల్ కనెక్ట్ ప్లాట్ఫామ్ అనుసంధానం కానున్నది.
ఇప్పటికే ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకులు సొంతంగా పైలట్ ప్రాతిపదికన బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. ఈ ఐబీబీఐసీలో అమెరికా బ్యాంక్.. స్టాండర్డర్ చార్టర్డ్ భాగస్వామిగా ఉంటుందని భావిస్తున్నారు.