ముంబై, సెప్టెంబర్ 16: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ గురువారం తమ గృహ రుణ కస్టమర్ల కోసం వివిధ పండుగ ఆఫర్లను ప్రకటించింది. 6.7 శాతం వడ్డీరేటుకే హోమ్ లోన్ ఇస్తామని తెలిపింది. రుణ మొత్తం ఎంతన్నదానితో సంబంధం లేకుండా రుణగ్రహీతల క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఈ వడ్డీరేటును వర్తింపజేస్తామని బ్యాంక్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. నిజానికి ఇంతకుముందు రూ.75 లక్షలకుపైగా గృహ రుణం తీసుకుంటే వడ్డీరేటు 7.15 శాతంగా ఉండేది. అయితే తాజా ఆఫర్లో వీరికీ 6.7 శాతం వడ్డీరేటుకే హోమ్ లోన్ లభిస్తుంది. దీనివల్ల వడ్డీరేటు 45 బేసిస్ పాయింట్లు తగ్గుతున్నదని, ఫలితంగా 30 ఏండ్ల కాలపరిమితితో రూ.75 లక్షల రుణం తీసుకునేవారికి రూ.8 లక్షలకుపైగా వడ్డీ ఆదా అవుతుందని ఓ ప్రకటనలో ఎస్బీఐ వివరించింది.
ఉద్యోగులతో పోల్చితే ఉద్యోగేతరుల గృహ రుణాలపై వడ్డీరేటు 15 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉండేది. ఇప్పుడీ తేడానూ తొలగిస్తున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. క్రెడిట్ స్కోర్ బాగుంటే ఎవ్వరికైనా ఒకే వడ్డీరేటు అని ఎస్బీఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ ఎండీ సీఎస్ శెట్టి ఈ సందర్భంగా తెలియజేశారు. మరోవైపు ఈ పండుగ ఆఫర్లలో భాగంగా రుణాలపై ప్రాసెసింగ్ ఫీజూ ఉండబోదన్నారు.
ఇతర బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల నుంచి లోన్ మార్పిడి పెట్టుకునేవారికీ 6.7 శాతం వడ్డీరేటే ఉంటుంది. ‘సాధారణంగా రాయితీ వడ్డీరేట్లు నిర్ణీత మొత్తాల వరకున్న గృహ రుణాలకే కల్పిస్తాం. లేదంటే వృత్తుల ఆధారంగా ప్రకటిస్తాం. కానీ ఈసారి అందరికీ తక్కువ వడ్డీరేటు సౌకర్యాన్ని అందిస్తున్నాం’ అని శెట్టి అన్నారు.