SBI Credit Card | మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. అలా క్రెడిట్ కార్డు వాడకం బిల్లుల పేమెంట్స్ సర్వీస్ చార్జీలు తడిసిమోపెడు కానున్నాయి. ఈ నెల 17 నుంచి సవరించిన సర్వీస్ చార్జీలు అమల్లోకి వచ్చాయి. దీంతో మీ పర్స్కు చిల్లు పడుతుంది.. గతంలో రూ.99 గల ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ ఫీజు ఇప్పుడు రూ.199లకు పెరిగింది. వీటితోపాటు జీఎస్టీ, ఇతర పన్నులు కూడా అదనంగా కలుస్తాయి. ఈ మేరకు క్రెడిట్ కార్డు బిల్లుల సర్వీస్ ఫీజు పెరిగిందంటూ ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ తన క్లయింట్లకు ఈ-మెయిల్ పంపింది.
సింప్లీ క్లిక్ కార్డు హోల్డర్లకు కొన్ని నిబంధనలు అప్డేట్ చేసినట్లు ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ మరోసారి గుర్తు చేసింది. నిబంధనల్లో మార్పులు ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చాయి. గిఫ్ట్ కార్డుల రీడింప్షన్, రివార్డు పాయింట్ల రీడిమ్ నిబంధనలు మారాయని ఎస్బీఐ కార్డ్ తెలిపింది. గత జనవరి ఆరో తేదీ నుంచి తప్పనిసరిగా ఆన్లైన్లో సింగిల్ పర్చేజ్ చేసిన వారికి మాత్రమే క్లియర్ ట్రిప్ ఓచర్ ఇస్తామని స్పష్టం చేసింది. దీన్ని మరో ఇతర ఆఫర్ లేదా ఓచర్తో కలిపే ప్రసక్తే లేదని పేర్కొంది. అంతే కాదు గత జనవరి ఒకటో తేదీ నుంచి అమెజాన్. ఐఎన్ (Amazon.in)లో సింప్లీ క్లిక్ కార్డు హోల్డర్ల ఆన్లైన్ కొనుగోళ్ల మీద ఇచ్చే రివార్డు పాయింట్ల పాలసీ కూడా మార్చేసింది.
‘అమెజాన్.ఐఎన్తో ఆన్లైన్లో సింప్లీ క్లిక్ లేదా సింప్లీ క్లిక్ అడ్వాంటేజ్ ఎస్బీఐ కార్డుతో ఆన్లైన్ కొనుగోళ్లపై ఇప్పటివరకు 10x రివార్డు పాయింట్లు లభించేవి. కానీ గత జనవరి ఒకటో తేదీ నుంచి ఆ రివార్డు పాయింట్లను 5x రివార్డు పాయింట్లకు తగ్గించాం. అపొలో24X7, బుక్మై షో, క్లియర్ ట్రిప్, ఈజీ డైనర్, లెన్స్కార్ట్, నెట్మెడ్స్ వేదికల్లో ఆన్లైన్ కొనుగోళ్ల మీద మాత్రం 10x రివార్డు పాయింట్లు కొనసాగుతాయి’ అని ఎస్బీఐ క్రెడిట్ కార్డు వెల్లడించింది.