న్యూఢిల్లీ, ఆగస్టు 9: పలు కార్పొరేట్లు ఎగవేసిన రుణాల్ని ఖాతా పుస్తకాల్లోంచి తొలగించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రయత్నం మొదలుపెట్టింది. అనీల్ అంబానీ గ్రూప్, వీడియోకాన్ గ్రూప్, జేపీ గ్రూప్, ఫ్యూచర్ గ్రూప్ తదితర 331 దివాలా కార్పొరేట్లకు చెందిన రూ.96,278 కోట్ల ఎన్పీఏలను ఎస్బీఐ అమ్మకానికి పెట్టినట్టు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ సోమవారం ఒక కథనం ప్రచురించింది. ఎన్పీఏల కొనుగోలుకు ప్రాధమిక ఆసక్తి కలిగిన అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు (ఏఆర్సీలు) తాను విక్రయించదల్చిన రుణాల జాబితాను ఎస్బీఐ సర్క్యులేట్ చేసినట్టు సమాచారం.
ఏడాదిలో మూడు రెట్లు పెరుగుదల
ఈ ఏడాది ఎస్బీఐ అమ్మకానికి ఉంచిన మొండి బాకీలు గత ఏడాదితో పోలిస్తే మూడు రెట్లు అయ్యాయి. 2022 మే 23న రూ.31,363 కోట్ల విలువైన 168 కార్పొరేట్ ఖాతాలను ఎస్బీఐ ఏఆర్సీలకు సర్క్యులేట్ చేయగా, ఈ ఏడాది అది రూ. 96,278 కోట్లకు చేరింది. వాస్తవానికి బ్యాంకర్లు తమ మొండి బకాయిలు గరిష్ఠస్థాయికి చేరినట్టేనని, మరింత పెరిగే అవకాశం లేదంటూ గత ఏడాదికాలంగా చెపుతున్నారు. ఇందుకు భిన్నంగా రుణ ఎగవేతలు కుప్పలుకుప్పలుగా పెరిగిపోతున్నాయి. ఎస్బీఐ నిరర్థక ఆస్తులు 2023 జూన్ 30నాటికి గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే రూ. 1,13,272 కోట్ల నుంచి రూ. 91,328 కోట్లకు తగ్గినట్టు ఇటీవలి ఆర్థిక ఫలితాల్లో వెల్లడించినప్పటికీ, అమ్మకానికి ఉంచిన మొండి బకాయిలు మూడు రెట్లు పెరగడం గమనార్హం.
బడా కార్పొరేట్లు…భారీ ఎగవేతలు
తాజాగా ఎస్బీఐ వదిలించుకోవాలని చూస్తున్న మొండి బకాయిలు పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఎగవేసినవే. ఇందులో రిటైల్, టెలికం, ఇన్ఫ్రా, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర రంగాలకు చెందినవి ఉన్నాయి. బియానీలకు చెందిన ఫ్యూచర్ గ్రూప్ రూ.2,254 కోట్ల మొండి బకాయిలు ఉండగా, అందులో ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ రూ.1,138 కోట్ల రుణం, ఫ్యూచర్ రిటైల్ రుణం రూ.907 కోట్లు, ఫ్యూచర్ లైఫ్ైస్టెల్స్ ఫ్యాషన్వి రూ.401 కోట్లు, ఫ్యూచర్ కన్జూమర్వి రూ.108 కోట్లు ఉన్నాయి. ఈ గ్రూప్ రిటైల్, హోల్సేల్ వ్యాపారాన్ని ముకేశ్ అంబానీ గ్రూప్నకు విక్రయించేందుకు కుదుర్చుకున్న లావాదేవీ విఫలంకావడంతో ఇది దివాలా బాట పట్టిన సంగతి తెలిసిందే.
అనిల్ అంబానీ గ్రూప్లోని రిలయన్స్ కమ్యూనికేషన్, (రూ.3,014 కోట్లు), రిలయన్స్ టెలికం (రూ.167 కోట్లు), వీడియోకాన్ గ్రూప్నకు చెందిన వీడియోకాన్ కమ్యూనికేషన్స్ (రూ.1,008 కోట్లు)..ఎస్బీఐ అమ్మకానికి పెట్టిన ఎన్పీఏల్లో ఉన్నాయి. శివశంకరన్ ప్రమోట్ చేసిన ఎయిర్సెల్ లిమిటెడ్, ఎయిర్సెల్ సెల్యులర్, డిష్నెట్ వైర్లెస్ల రూ.6,978 కోట్ల రుణాల్ని సైతం ఏఆర్సీలకు బ్యాంక్ విక్రయించాలని ప్రయత్నిస్తున్నది. జేపీ గ్రూప్లోని జేపీ అసోసియేట్స్ రూ.4,506 కోట్లు, జేపీ సిమెంట్ రూ.195 కోట్ల రుణాలు డిఫాల్ట్ అయ్యాయి. వీడియోకాన్ గ్రూప్నకు చెందిన మూడు సంస్థలు- చమురు, గ్యాస్ కంపెనీ వీవోవీఎల్, వీడియోకాన్ ఇండస్ట్రీస్, వీడియోకాన్ టెలికంల మొండి బకాయిలు రూ. 9 వేల కోట్లకుపైనే.
వచ్చేది చాలా తక్కువే
తాజాగా ఎస్బీఐ ఏఆర్సీలకు సర్క్యులేట్ చేసిన మొండి బకాయిలు ఆయా గ్రూప్ల నుంచి వసూలు కావాల్సిన పుస్తక విలువ (అసలు, వడ్డీ కలిపి) ప్రకారం రూ.96,278 కోట్లు కాగా, వాటి నికర విలువ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఆయా కంపెనీల ఆస్తుల్ని విక్రయిస్తే వచ్చే అవకాశం ఉన్న మొత్తం. ఇందులో చాలావరకూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ ముందు ఉన్న దివాలా కేసులు. దివాలా చట్టం కింద వివిధ దశల్లో రికవరీ ప్రయత్నాలు జరుగుతున్న ఎన్పీఏలివి. ఏఆర్సీలు వాటిని బ్యాంక్ల నుంచి వాటి నికర విలువకే కొనుగోలు చేస్తాయి. భవిష్యత్తులో ఆ నికర విలువకంటే మరింత తక్కువ వసూలయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషకులు వివరించారు.