SBI Digital | ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మాజీ సీఈవో నితిన్ చుగ్కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కీలక ఆపరేషన్లు అప్పగించింది. డిజిటల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ నిర్వహణ కోసం బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా నితిన్చుగ్ను నియమించింది. ప్రాథమికంగా నితిన్ చుగ్ ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగుతారని అధికార వర్గాలు తెలిపాయి.
ఎస్బీఐ డిజిటల్ బ్యాంకింగ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పోస్టు కోసం గత డిసెంబర్లో అప్లికేషన్లను ఆహ్వానించింది. దీని ప్రకారం ఎస్బీఐ డిజిటల్ బ్యాంకింగ్ వ్యూహం రూపొందించాల్సి ఉంటుంది. నిర్మాణాత్మక, సాధికారికంగా, పరస్పర సహకారంతో డిజిటల్ నాలెడ్జ్ లేదా నైపుణ్యం అందుబాటులోకి తేవడానికి బిజినెస్ ప్రణాళిక రూపొందించాలి. ఇంతకుముందు ప్రైవేట్ రంగం నుంచి ఎస్బీఐ.. చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (సీఎఫ్వో)ను నియమించింది.
ఇంతకుముందు నితిన్ చుగ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈవోగా పని చేశారు. 2019లో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో చేరినా గతేడాది సెప్టెంబర్లో వ్యక్తిగత కారణాల రీత్యా వైదొలిగారు. తొలుత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్గా సేవలందించారు.