Smart Phones | ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంటారు. ఒక్కోసారి పొరపాటున పోగొట్టుకున్నా.. దొంగలు కొట్టేస్తారు. అలా కొట్టేసిన స్మార్ట్ ఫోన్లు క్రిమినల్స్ చేతికి చిక్కినా.. దానిపై ఉన్న ఐఎంఈఐ నంబర్ ఆధారంగా ట్రాక్ చేసేవారు. కానీ ఇప్పుడు నేరగాళ్లు కూడా తెలివి మీరారు. తమ చేతికి చిక్కిన స్మార్ట్ ఫోన్లపై ఐఎంఈఐ నంబర్ మార్చేస్తున్నారు. అటువంటప్పుడు ఆ ఫోన్ ట్రాక్ చేయడం కష్టం.. కానీ.. ఇప్పుడలా కాదు.. అలా ఐఎంఈఐ మార్చినా, సదరు స్మార్ట్ ఫోన్ను బ్లాక్ చేసే టెక్నాలజీ త్వరలో అందుబాటుకి రాబోతున్నది. ఈ టెక్నాలజీ దేశవ్యాప్తంగా వినియోగంలోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
సెంటర్ ఫర్ డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీ మ్యాటిక్స్ (సీ-డాట్) ప్రస్తుతం ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఈశాన్య ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ టెక్నాలజీని పరీక్షిస్తున్నది. సీ-డాట్ సీఈఓ కం చైర్మన్ రాజ్ కుమార్ ఉపాధ్యాయ మాట్లాడుతూ తాము రూపొందించిన టెక్నాలజీ.. ‘ఇన్ బిల్ట్ మెకానిజం.. స్మగుల్డ్ మొబైల్ ఫోన్లను చెక్ చేస్తుంది` అని తెలిపారు. అయితే, ఎప్పటి నుంచి ఈ సేవలు దేశవ్యాప్తం చేస్తారన్న సంగతి మాత్రం వెల్లడించలేదు.
సీ-డాట్ పోర్టల్ డేటా ప్రకారం ఇప్పటి వరకు 4.70 లక్షల ఫోన్లు దొంగతనానికి గురి కావడమో, సంబంధిత వ్యక్తులు పోగొట్టుకోవడమో జరిగింది. వాటిలో 2.40 లక్షలకు పైగా మొబైల్ ఫోన్లను ట్రాక్ చేశారు. 8000 ఫోన్లను రికవర్ చేశారు. ఇటీవలే కర్ణాటక పోలీసులు 2,500 ఫోన్లను రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకు అందజేశారు.
మొబైల్ ఫోన్ల విక్రయానికి ముందే దానిపై గల ఐఎంఈఐ నంబర్ బయట పెట్టాలని నిబంధన. మొబైల్ ఫోన్ నెట్ వర్క్ ల వద్ద సదరు ఐఎంఈఐ నంబర్ల జాబితా ఉంటది. ఏ అనధికారిక మొబైల్ ఫోన్ తమ నెట్ వర్క్ పరిధిలోకి వచ్చినా సంబంధిత టెలికం సంస్థలు గురిస్తాయి. మొబైల్ ఫోన్ నెట్ వర్క్ లతోపాటు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) వద్ద కూడా ఈ ‘ఐఎంఈఐ’ నంబర్ల జాబితా ఉంటది. ఈ సమాచారం ఆధారంగా చేసుకునే తస్కరణకు గురైన ఫోన్ ట్రాక్ చేసి, బ్లాక్ చేస్తారు. ఇలా చేయడం వల్ల స్మార్ట్ ఫోన్ల దొంగతనాలు తగ్గిపోయే అవకాశం ఉంటదని నిపుణులు తెలిపారు. దొంగల్ని గుర్తించడానికి కూడా వీలవుతుందని పోలీసులు చెబుతున్నారు.
ఈ నెల 17న అంతర్జాతీయ టెలికం డే.. ఈ సందర్భంగా కేంద్ర టెలికం మంత్రి అశ్వినీ వైష్ణవ్.. సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్)ను అధికారికంగా ప్రారంభిస్తారని చెబుతున్నారు.