Sanchar Saathi App | సైబర్ సెక్యూరిటీ కోసం ప్రభుత్వం రూపొందించిన సంచార్ సాథీ యాప్ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా ముందస్తుగా ఈ యాప్ను ఇన్స్టాల్ చేయాలని మొబైల్ కంపెనీలను ఆదేశించింది. అయితే, ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ యాప్ను పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసుకుంటుండడం విశేషం. టెలికమ్యూనికేషన్స్ శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. మంగళవారం ఒకేరోజు దాదాపు 6లక్షల మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. సాధారణ రోజుల్లో దాదాపు 60వేల మంది వరకు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసేవారు. అంటే ఒకే రోజు పదిరెట్ల డౌన్లోడ్స్ పెరిగాయి. అధికారిక డేటా ప్రకారం.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు 15 మిలియన్ల మంది ఇప్పటికే సంచార్ సాథీ యాప్ను డౌన్లోడ్ చేశారు.
నవంబర్ 28న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. అన్ని మొబైల్ కంపెనీలను ఫోన్లలో యాప్ను ప్రీ ఇన్స్టాల్ చేయాలని ఆదేశించింది. భారత్లోని అన్ని ఫోన్ కంపెనీలు తమ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ను ముందే ఇన్స్టాల్ చేయాలని.. పాత డివైజెస్లో కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా యాప్ను ఇన్స్టాల్ చేయాలని ఆదేశించింది. ఆయా కంపెనీలు ఫోన్లను తొలిసారి ఆన్ చేసిన సమయంలో యాప్ వినియోగదారులకు కనిపించేలా చూడాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే, కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు వ్యక్తిగత గోప్యతకు సంబంధించి తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
కేంద్రం నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దేశ పౌరులపై నిఘా పెట్టేందుకే ఈ యాప్ తీసుకువస్తుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రజల స్వేచ్ఛకు భంగమని పేర్కొంది. యాప్ విషయంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గింది. మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ ప్రీఇన్స్టాలేషన్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. అయితే, సంచార్ సాథి యాప్ను మొదట 2023లో పోర్టల్గా ప్రారంభించారు. స్కామ్ కాల్ గురించి తెలిపేందుకు.. యూజర్ల తమ పేరుపై రిజిస్టర్ అయిన సిమ్కార్డులను గుర్తించేందుకు, దొంగతనాలు జరిగినప్పుడు ఫోన్లను డీయాక్టివేట్ చేసేందుకు దీన్ని తీసుకువచ్చారు. ఇది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) డీఎన్డీ యాప్ తరహాలో ఉంటుంది.