FTX | చట్టాలు ఉల్లంఘించడంతోపాటు ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసిన ప్రముఖ క్రిప్టో ఎక్స్చేంజ్ ఎఫ్టీఎక్స్ (FTX) వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో బ్యాంక్ మన్ ఫ్రీడ్ను బహమాస్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ ఇది. బహమాస్ కేంద్రంగా పని చేస్తున్న ఎఫ్టీఎక్స్ సంస్థ గత నెల 11వ తేదీన దివాళా ప్రక్రియ చేపట్టాలని కోరింది.
క్రిప్టో కరెన్సీ కస్టమర్లు చేసిన డిపాజిట్లను ఎఫ్టీఎక్స్ తన సొంత కంపెనీ అలమెడా రీసెర్చ్లో మిక్స్ చేయడంతో వివాదం తలెత్తింది. ఆ తర్వాత ఎఫ్టీఎక్స్ భారీగా పతనమై.. పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. అమెరికా, బహమాస్ దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు బ్యాంక్ మన్ ఫ్రీడ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు దేశాల్లోనూ ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు బ్యాంక్ మన్ ఫ్రీడ్ మీద అభియోగాలు నమోదయ్యాయి.
ఎఫ్టీఎక్స్ దివాళా ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా బ్యాంక్ మన్ ఫ్రీడ్.. బహమాస్ రాజధాని నసావౌలోని లగ్జరీ భవనంలోనే నివాసం ఉన్నారు. చట్టాలు ఉల్లంఘించి, ప్రజా విశ్వాసాన్ని వమ్ము చేసిన వారిని చట్టం ముందు నిలిపేందుకు అమెరికాతో కలిసి పని చేస్తామని బహమాస్ ప్రధాని ఫిలిప్ డేవిస్ చెప్పారు. అతడ్ని వెంటనే అమెరికాకు అప్పగిస్తామని బహమాస్ అటార్నీ జనరల్ ర్యాన్ పిండర్ ప్రకటించారు.
ఇదిలా ఉంటే, బ్యాంక్ మన్ ఫ్రీడ్ పై కేసు నమోదు చేస్తామని అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కూడా పేర్కొంది. ఫ్రీడ్ అమెరికా సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించారని వెల్లడించింది. ఒకానొక దశలో బ్యాంక్ మన్ ఫ్రీడ్ ను ‘కింగ్ ఆఫ్ క్రిప్టో’గా కీర్తించారు. ఎఫ్టీఎక్స్ పతనం కావడానికి ముందు వాషింగ్టన్ నగర ప్రముఖుల్లో ఒకరిగా ఉన్నారు.