Infosys | ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) కం మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా సలీల్ పరేఖ్ తిరిగి నియమితులయ్యారు. ఐదేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఎక్స్చేంజ్లకు ఆదివారం ఇచ్చిన సమాచారంలో ఇన్ఫోసిస్ తెలిపింది. వచ్చే జూలై ఒకటో తేదీ నుంచి 2027 మార్చి 31 వరకు ఇన్ఫోసిస్ సీఈవో కం ఎండీగా కొనసాగుతారని వెల్లడించింది. దీనికి సంస్థ వాటాదారుల ఆమోదం లభించాల్సి ఉందని పేర్కొంది. ఇన్పోసిస్ బోర్డు డైరెక్టర్లలో ఏ ఒక్కరితోనూ సలీల్ పరేఖ్కు సంబంధం లేదన్నది. సీఈవో కం మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఓ ప్రకటనలో వివరించింది.
సలీల్ పరేఖ్ 2018 జనవరి నుంచి గత నాలుగేండ్లుగా ఇన్ఫోసిస్ సీఈవో కం ఎండీగా విజయవంతంగా సంస్థకు సారధ్యం వహించారు. అంతర్జాతీయంగా ఐటీ సేవల రంగంలో 30 ఏండ్లకు పైగా అనుభవం కలిగిన వ్యక్తి. ఇంతకుముందు క్యాప్జెమినీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా పని చేశారు. క్యాప్జెమినీలో 25 ఏండ్లపాటు వివిధ క్యాటగిరీల్లో నాయకత్వ పాత్ర పోషించారు.
ఎర్న్ట్స్ అండ్ యంగ్ భాగస్వామిగానూ సలీల్ పరేఖ్ ఉన్నారు. భారత్లో ఎర్న్ట్స్ అండ్ యంగ్ కార్యకలాపాల నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. బాంబే-ఐఐటీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్లో బీటెక్ పూర్తి చేసుకున్న సలీల్ పరేఖ్.. కార్న్వెల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజినీరింగ్ల్లో ఎంటెక్ పట్టాలు అందుకున్నారు.