న్యూఢిల్లీ, మే 20: డీజిల్ కార్లు కనుమరుగవబోతున్నాయా! అంటే నిజమేననిపిస్తున్నది. ఒకప్పుడు దేశీయ రోడ్లపై టాప్గేర్లో దూసుకుపోయిన ఈ కార్లకు ప్రస్తుతం ఆదరణ అంతంత మాత్రంగానే కనిపిస్తున్నది. 2012లో దేశీయ కార్ల విక్రయాల్లో 54 శాతం వాటాతో ఉన్న డీజిల్ కార్లు.. 2020 నాటికి 18 శాతానికి పడిపోవడం ఇందుకు అద్దం పడుతున్నది. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీఎస్6 ఉద్గార నియమ నిబంధనలతోనూ అమ్మకాలకు బ్రేక్పడినైట్టెంది. కాలుష్య ఉద్గారాలకు సంబంధించి గడిచిన కొన్నేండ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీలతో డీజిల్ కార్ల వాడకం గణనీయంగా తగ్గిందని ఇండస్ట్రీ వర్గాలూ చెప్తున్నాయి. ఇప్పటికే ఉన్న నిబంధనలకుతోడు బీఎస్6 స్టేజ్ 2 నిబంధనలు కూడా అమలులోకి రావడంతో డీజిల్ కార్లపై మరో పిడుగు పడింది. దీంతో చిన్న డీజిల్ ఇంజిన్ కార్ల తయారీని ఆటోమొబైల్ సంస్థలు అటకెక్కించాయి.
పర్యావరణ ఆందోళనలు కూడా..
పెట్రోల్ కార్లతో పోలిస్తే డీజిల్ కార్లు అధిక కాలుష్యాన్ని వెదజల్లుతుండటం కూడా విక్రయాలు తగ్గడానికి ప్రధాన కారణం. ఈ కార్లు వదిలే నైట్రోజన్ ఆక్సైడ్తో శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల మధ్య అంతరం కూడా రానురాను తగ్గుతుండటం కూడా పెట్రోల్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాగే డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు చౌకగా లభిస్తుండటంతో వీటిని కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారు.