79.33 కొత్త రికార్డుస్థాయికి.. 38 పైసలు పడిపోయిన కరెన్సీ
ముంబై, జూలై 5: అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ రికార్డుస్థాయికి బలోపేతంకావడంతో ఇతర ప్రపంచ ప్రధాన కరెన్సీలతో రూపాయి సైతం భారీగా పతనమయ్యి, మరో చరిత్రాత్మక కనిష్ఠస్థాయిని తాకింది. మంగళవారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ ఏకంగా 38 పైసలు పడిపోయి, 79.33 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది రికార్డు కనిష్ఠస్థాయి 79.38 స్థాయిని తాకింది. ఆరు ప్రధాన కరెన్సీలతో కూడిన డాలర్ ఇండెక్స్ 1 శాతంపైగా పెరిగి 106 స్థాయిపైకి చేరింది. ఒక పక్క మాంద్యం భయాలు, మరోవైపు వడ్డీ రేట్లు మరింత వేగంగా పెరుగుతాయన్న అంచనాలతో రిస్క్ ఆస్తుల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వైదొలిగి డాలర్లను తరలించుకుపోవడంతో రూపాయి, ఇతర వర్థమాన దేశాల కరెన్సీలు తగ్గుతున్నాయని, డాలర్ బలపడుతున్నదని విశ్లేషకులు చెప్పారు.
డాలర్ పెరగడంతో పాటు దేశీయంగా వాణిజ్య గణాంకాలు అంచనాలకంటే బలహీనంగా ఉండటంతో రూపాయి భారీగా తగ్గిందని బీఎన్పీ పారిబా రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు. ఫెడ్ వడ్డీ రేట్లను వేగంగా పెంచుతుందన్న అంచనాలతో డాలర్ మరింతగా బలపడుతుందని, బంగారంపై దిగుమతి సుంకం పెంచినందున రూపాయికి కొంతమేర మద్దతు లభించవచ్చని చౌదరి అభిప్రాయం వ్యక్తంచేశారు. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) దేశీ స్టాక్ మార్కెట్లో ఎడతెరపిలేకుండా విక్రయాలు జరపడం కూడా రూపాయి విలువను దెబ్బతీస్తున్నదని విశ్లేషకులు చెప్పారు.
రూ.82 స్థాయికి రూపాయి
ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నోమురా అంచనా
ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) రూపాయి విలువ 82 స్థాయికి పడిపోతుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నోమురా అంచనా వేసింద. ఇప్పటికే కరెన్సీ క్షీణించడంతో పాటు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఫెడ్ వడ్డీ రేట్లను భారీ పెంచుతుందన్న భయాలతో ఎఫ్పీఐలు వర్థమాన మార్కెట్ల నుంచి నిధుల తరలింపును వేగవంతం చేస్తారని నోమురా వివరించింది. దీంతో భారత్ కరెంట్ ఖాతా లోటు (దేశంలోకి వచ్చే విదేశీ మారకం-పోయే మారకం మధ్య వ్యత్యాసం) ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3.3 శాతానికి చేరుతుందన్నది. గత ఏడాది ఈ లోటు1.2 శాతంగా ఉంది. అధిక వాణిజ్యలోటు..కరెంట్ ఖాతా లోటు పెరుగుదలకు కారణమవుతుందని నోమురా పేర్కొంది. బంగారం దిగుమతులపై సుంకాన్ని 15 శాతానికి పెంచడం, పెట్రో ఎగుమతులపై పన్ను విధించడం వంటి చర్యలు వాణిజ్యలోటును అదుపు చేయడానికి పెద్దగా సహాయపడవని అంచనా వేసింది.
వాణిజ్యలోటు దెబ్బ
జూన్ నెలలో వాణిజ్యలోటు అంచనాలకంటే అధికంగా పెరిగి 25.63 బిలియన్ డాలర్లకు చేరింది. ఒకే నెలలో ఈ స్థాయిలో లోటు నమోదుకావడం ఇదే ప్రథమం. ఎగుమతులకంటే దిగుమతులు భారీగా పెరగడంతో వాణిజ్యలోటు అనూహ్యంగా విస్త్రతమయ్యింది. బంగారం, చమురు దిగుమతుల జోరు కారణంగా మొత్తంగా దిగుమతులు 63.57 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎగుమతుల సైతం 17 శాతం వృద్ధిచెందినప్పటికీ, 37.94 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. దిగుమతుల కోసం భారత్ డాలర్లను ఖర్చుచేయాల్సి వస్తుందన్న భయాలతో రూపాయి పతనమయ్యిందని విశ్లేషకులు
తెలిపారు.