ముంబై, అక్టోబర్ 6: రెండు రోజులపాటు కోలుకుంటున్నట్టు కన్పించిన రూపాయి గురువారం ఒక్కసారిగా కుప్పకూలింది. చరిత్రలో తొలిసారిగా 82 మార్క్ దిగువకు పడిపోయింది. 55 పైసలు నష్టపోయి 82.17 వద్ద ముగిసింది. ఫారెక్స్మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలో 81.52 స్థాయి వద్ద రూపాయి సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో డాలరు బలపడటంతో స్థానిక కరెన్సీ క్రమేపీ క్షీణించింది. గత ట్రేడింగ్ రోజైన మంగళవారం రూపాయి 20 పైసలు పెరిగి 81.62 వద్ద ముగిసింది.
చమురు ఎగుమతి దేశాల మండలి ఒపెక్ ఉత్పత్తిలో కోత విధించడంతో ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర బ్యారల్కు 93.80 డాలర్లకు పెరిగిందని, దీంతో రూపాయి తీవ్ర ఒడిదుడుకులకు లోనయినట్టు ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. అమెరికాలో సర్వీసుల పీఎంఐ, ప్రైవేట్ పేరోల్స్కు సంబంధించి సానుకూల గణాంకాలు వెలువడటంతో డాలర్ బలపడిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫారెక్స్ నిపుణుడు గౌరాంత్ సోమయ్య చెప్పారు. సమీప భవిష్యత్తులో రూపాయి మారకపు విలువ 82 దిగువన 81.40, 82.90 స్థాయిలకు తగ్గవచ్చని, 81.35 స్థాయి మద్దతునివ్వవచ్చని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ శ్రీరామ్ అయ్యర్ అంచనా వేశారు.