ముంబై, జూలై 22: రూపాయి ఒడిదుడుకుల్ని నియంత్రించడానికి విదేశీ మారక నిల్వల్ని ఉపయోగిస్తున్నట్టు రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. అమెరికా డాలర్ మారకంలో రూపాయి విలువ పతనమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశీ కరెన్సీ హఠాత్తుగా తీవ్ర ఒడిదుడులకు లోనవుతున్నందున, ఫారెక్స్ (ఫారిన్ ఎక్సేంజ్) మార్కెట్ సజావుగా, తగిన లిక్విడిటీతో నడిచేలా కేంద్ర బ్యాంక్ చర్యలు తీసుకుంటున్నదన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్వహించిన ఒక బ్యాంకింగ్ సదస్సులో దాస్ మాట్లాడుతూ ఫారెక్స్ మార్కెట్లో రిజర్వ్బ్యాంక్ జోక్యం కొనసాగుతుందని, ఫండమెంటల్స్కు అనుగుణమైన స్థాయిలో రూపాయి స్థిరపడేలా చూస్తుందని వివరించారు. దిగుమతులు, విదేశీ రుణ చెల్లింపు అవసరాలు, ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కు తీసుకుంటున్న నిధుల కారణంగా డాలర్కు డిమాండ్ ఉంటున్నదని, ఈ ఫారెక్స్ సరఫరాలో ఏర్పడిన కొరతను గుర్తించి, మార్కెట్లోకి ఆర్బీఐ అమెరికా డాలర్లను సరఫరా చేస్తున్నదన్నారు.
‘దేశంలోకి మూలధన రాబడులు పుష్కలంగా ఉన్నపుడు మనం ఫారెక్స్ రిజర్వ్ల్ని పెంచుకున్నది ఈ ప్రయోజనం కోసమే. వర్షం పడినపుడు వాడేందుకే గొడుగు కొంటాం’ అని దాస్ వ్యాఖ్యానించారు. రూపాయి విలువ ఆల్టైమ్ కనిష్ఠస్థాయి 80.06 వద్దకు తగ్గిన విషయం విదితమే. ఈ స్థాయి నుంచి రూపాయి కొంతమేర కోలుకుని శుక్రవారం 79.86 వద్ద ముగిసింది. రూపాయికి ఫలానా స్థాయి అనేది తమ ఆలోచనల్లో లేదని, క్రమేపీ అది ఉండాల్సిన స్థాయికి చేరుకునేలా చూడాలన్నది తమ ఉద్దేశ్యమని శక్తికాంత్ దాస్ చెప్పారు. ఇతర ధనిక, వర్థమాన దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి పటిష్ఠస్థాయిలో ఉన్నదని, ఇందుకు దేశ స్థూల ఆర్థిక ఫండమెంటల్స్ కారణమన్నారు.
ద్రవ్యోల్బణాన్ని దించుతాం
ద్రవ్యోల్బణాన్ని 4 శాతం సమీపానికి తగ్గించి, ఆర్థికాభివృద్ధి మీద నామమాత్రపు ప్రభావం ఉండేలా రిజర్వ్బ్యాంక్ చూస్తుందని శక్తికాంత్ దాస్ చెప్పారు. రిటైల్ ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయి నుంచి తగ్గుతున్న సంకేతాలు కన్పిస్తున్నాయని, ఇది 7.8 శాతం నుంచి 7 శాతానికి దిగిందన్నారు. 2022-23 సంవత్సరానికి తాము గతంలో ప్రకటించిన 6.7 శాతం ద్రవ్యోల్బణం అంచనాల్ని ఆగస్టులో జరిగే మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో సమీక్షిస్తామన్నారు. కొద్ది నెలల్లో క్రమేపీ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లక్ష్యానికి తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ సజావుగా నడిచేలా చూస్తామన్నారు. యూరప్లో యుద్ధం కారణంగా కమోడిటీ, క్రూడ్ ధరల పెరుగుదల, ఇతర కేంద్ర బ్యాంక్ల వడ్డీ రేట్ల పెంపు,కరెన్సీ తరుగుదల తదితర సవాళ్ల నేపథ్యంలో వృద్ధిని పెంచడంకంటే ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపైనే ఆర్బీఐ దృష్టినిలిపిందన్నారు.
భారీగా తగ్గిన ఫారెక్స్ నిల్వలు మరో 7.5 బిలియన్ డాలర్లు తరుగు
దేశం వద్దనున్న ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) నిల్వలు వరుసగా రెండోవారమూ భారీగా తగ్గాయి. జూలై 15తో ముగిసిన వారంలో ఇవి 7.541 బిలియన్ డాలర్ల మేర తగ్గడంతో మొత్తం రిజర్వులు 572.712 బిలియన్ డాలర్లకు చేరినట్టు రిజర్వ్బ్యాంక్ తాజాగా విడుదల చేసిన డాటా వెల్లడిస్తున్నది. జూలై 8తో ముగిసిన వారంలో ఇవి 8 బిలియన్ డాలర్లకు పైగా తరిగిపోయిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ డాటా ప్రకారం తాజా సమీక్షా వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 6.527 బిలియన్ డాలర్లు తగ్గి 511.562 బిలియన్ డాలర్లకు చేరగా, 830 మిలియన్ డాలర్ల విలువైన బంగారం నిల్వలు కూడా తగ్గాయి. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద 38.356 బిలియన్ డాలర్ల విలువైన పుత్తడి నిల్వలున్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెంత ఉన్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్లు) కూడా 155 మిలియన్ డాలర్ల మేర క్షీణించి, 17,857 బిలియన్ డాలర్లకు చేరాయి.