Indian currency | ముంబై, మే 22: రూపాయి విలువ అనూహ్యంగా పడిపోతూనే ఉన్నది. సోమవారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో రూ.83 దరిదాపుల్లోకి దిగజారింది. అంతకుముందు రోజు ట్రేడింగ్ ముగింపుతో చూస్తే 17 పైసలు క్షీణించి 82.84 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది ఎన్నడూ లేనంత వేగంగా ఈ మే నెలలో రూపాయి వేగంగా పతనమైంది. రెండు వారాల్లోనే 120 పైసల విలువను దేశీయ కరెన్సీ కోల్పోయింది. మే మొదటివారంలో 81.65 స్థాయి వద్ద బలంగా ఉన్న రూపాయి చూస్తుండగానే 82.85 స్థాయికి పతనమై భారీ నష్టాల్ని మూటకట్టుకుంది.
డాలర్ ఇండెక్స్ కొంతమేర బలపడినప్పటికీ, ఇతర వర్థమాన కరెన్సీలకంటే రూపాయి అధిక విలువను కోల్పోయింది. దేశం నుంచి ఎగుమతులు తగ్గుతాయన్న అంచనాలు, కార్పొరేట్ల నుంచి డాలర్లకు భారీ డిమాండ్ ఏర్పడటం తదితర అంశాలు రూపాయి విలువను తీవ్రంగా దెబ్బతీసాయి. ఇక సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసినా.. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు దిగివచ్చినా.. కరెన్సీ మార్కెట్లో ఆ మేరకు సానుకూల ప్రభావం మాత్రం కనిపించలేదు. అయితే స్టాక్ మార్కెట్లు పెరగడం, క్రూడ్ ధర తగ్గడం.. రూపాయి నష్టాలను కొంతమేర అడ్డుకోగలిగాయని ఫారెక్స్ ట్రేడర్లు చెప్తున్నారు. దీంతో మార్కెట్లు నష్టపోయినా, గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర పెరిగినా రూపాయి మరింతగా నష్టపోయి ఉండేదని వారు చెప్పకనే చెప్తున్నైట్టెంది.
క్రూడ్ ధరలు కీలకం
రూపాయి మారకం విలువలో హెచ్చుతగ్గులు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలపైనే ఆధారపడి ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. చైనా నుంచి క్రూడ్ డిమాండ్ ఇంకా తగ్గితే.. అది ఫారెక్స్ మార్కెట్లో రుపీ బలోపేతానికి దారితీస్తుందని వారి అంచనా. ఇక దేశీయంగా చూసినైట్టెతే.. ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రం, వర్షాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు, ఎగుమతులు-దిగుమతులు ప్రధానంగా రుపీని ప్రభావితం చేయవచ్చని అంటున్నారు. అలాగే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్వోఎంసీ) మినిట్స్ కూడా ఈ వారం ఫారెక్స్ మార్కెట్ను నిర్దేశించగలదని చెప్తున్నారు. ఈ క్రమంలోనే 82.40 నుంచి 83.30 మధ్యలో రుపీ ట్రేడింగ్కు అవకాశాలున్నాయని బీఎన్బీ పరిబాస్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌదరి అభిప్రాయపడుతున్నారు.