International business | న్యూఢిల్లీ, ఆగస్టు 21: విదేశాలతో భారత్ జరిపే వాణిజ్యంలో నిస్తేజం ఆవరించింది. ఈ ఏడాది తొలి ఆరు నెలలకుగాను (జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో) విదేశీ వాణిజ్యం 800 బిలియన్ డాలర్ల స్థాయిలో జరిగిందని ఓ సర్వే వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో జరిగిన వాణిజ్యంతో పోలిస్తే 2.5 శాతం తగ్గినట్లు తెలిపింది. అంతర్జాతయ దేశాలు నిరాశాజనక పనితీరు కనబర్చడంతో భారత్ ఇతర దేశాలతో జరుపుతున్న వాణిజ్యం కూడా తగ్గిందని గ్లోబల్ ట్రేడ్ రీసర్చ్ ఇంటివేటివ్(జీటీఆర్ఐ) తాజాగా వెల్లడించింది. దీంట్లో ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 1.5 శాతం పెరిగి 379.5 బిలియన్ డాలర్ల నుంచి 385.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో దిగుమతులు 5.9 శాతం తగ్గి 441.7 బిలియన్ డాలర్ల నుంచి 415.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
రూపాయి-డాలర్ రూపంలో జరిగిన వాణిజ్యం 76.16 శాతం నుంచి 82.18 శాతానికి చేరుకున్నది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం, అధిక ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్యవిధానం, ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల వల్లనే వాణిజ్యంలో ఆశించిన స్థాయిలో వృద్ధిని సాధించలేకపోయం.
– అజయ్ శ్రీవాత్సవ, జీటీఆర్ఐ కో-ఫౌండర్