Rupee Effect on Industry | న్యూఢిల్లీ, జూలై 16: రూపాయి క్షీణత దేశీయ పరిశ్రమను మిశ్రమంగా ప్రభావితం చేస్తున్నది. కొన్ని రంగాలు నష్టాలను చవిచూస్తుండగా.. మరికొన్ని రంగాలు లాభాలను అందుకుంటున్నాయి. ముఖ్యం గా సాఫ్ట్వేర్ ఎగుమతులు చేసే ఐటీ రంగ సంస్థలకు రూపీ పతనం కలిసొస్తున్నది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ గురువారం మునుపెన్నడూ లేనివిధంగా 80కి సమీపించి 79.99 వద్దకు చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం ట్రేడింగ్లో కాస్త కోలుకున్నా.. ఇప్పటికీ ఆందోళనకర స్థాయిలోనే ఉన్నది. అమెరికాలో ద్రవ్యోల్బణం ఆల్టైమ్ హైకి చేరడం, అక్కడి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచుతూపోతున్న నేపథ్యంలో రూపాయి విలువ రాబోయే రోజుల్లో మరింతగా దిగజారవచ్చన్న అంచనాలు వినిపిస్తుండటం గమనార్హం.
అంతకంతకూ క్షీణిస్తున్న రూపాయి విలువ దేశంలోకి వచ్చే అన్నిరకాల దిగుమతుల్ని భారం చేస్తుంది. ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్, ఆటో తదితర రంగాలన్నింటిపైనా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యం గా మొబైల్ ఫోన్ ధరలు పరుగులు పెట్టడం ఖాయమన్న అభిప్రాయాలు ఇండస్ట్రీ నుంచి వ్యక్తమవుతున్నాయి. ‘రూపాయి విలువ ఒక శాతం పడిపోతే అందులో 0.6 శాతం మొబైల్ ఫోన్ సరఫరా వ్యవస్థపై కనిపిస్తుంది. ఎందుకంటే మొబైల్ ఫోన్ విడిభాగాలు దేశంలోకి దిగుమతి అవుతున్నాయి. కాబట్టి రూపాయి మారకం విలువ 5 శాతం క్షీణిస్తే.. మొబైల్ ఫోన్ ఇండస్ట్రీ లాభాలు 3 శాతం తగ్గుతాయన్నమాట. అందుకే ఫోన్ల ధరలు అంతలా పెరుగుతాయి’ అని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మొహింద్రూ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో లావాదేవీలన్నీ డాలర్ల రూపంలోనే జరుగుతాయి. దేశీయ ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటంతో రూపాయి క్షీణత మరిన్ని డాలర్లను చెల్లించుకోవాల్సిన పరిస్థితిని తెచ్చిపెడుతున్నది.
దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న వస్తూత్పత్తిదారులకు, సేవలకు రూపాయి పతనం లాభిస్తుంది. ఎగుమతి చేసే ప్రతీదానికి ఎక్కువ డాలర్లు ఆయా సంస్థలకు వస్తున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎగుమతులు చేసే ఐటీ కంపెనీలకు కాసుల పంట పండుతున్నది. ‘దేశీయ ఐటీ రంగంలో డాలర్లదే పెత్తనం. కనుక సాఫ్ట్వేర్ రంగానికి రూపాయి పతనం సహజంగానే లాభిస్తుంది. విదేశాలకు పెద్ద ఎత్తున భారత్ నుంచి ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి ఐటీ కంపెనీలకు కలిసొస్తున్నది’ అని ఐసీఆర్ఏ కార్పొరేట్ రేటింగ్స్ అసిస్టెంట్ ఉపాధ్యక్షుడు దీపక్ జోత్వానీ అన్నారు. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్ పెరిగితే 5 శాతం, బ్రిటన్ పౌండ్ బలపడితే 6.6 శాతం, ఆస్ట్రేలియా డాలర్ పుంజుకుంటే 1.7 శాతం చొప్పున ఐటీ కంపెనీల ఆదాయం పెరుగుతుందని కొటక్ సెక్యూరిటీస్ ఫండమెంటల్ రిసెర్చ్ ఉపాధ్యక్షుడు సుమిత్ పోకర్ణ అన్నారు. తోలు, రత్నాలు తదితర ఎగుమతి రంగాలకూ లాభమేనంటున్నారు.