ముంబై, జూన్ 28: వరుసగా గత నాలుగు ట్రేడింగ్ సెషన్లుగా ఎప్పటికప్పుడు రికార్డు కనిష్ఠాల్ని నమోదుచేస్తున్న రూపాయి మంగళవారం బెంబేలెత్తించింది. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ ఒక్కసారిగా 48 పైసలు పతనమై 78.85 చరిత్రాత్మక కనిష్ఠస్థాయి రూ.78.85 వద్ద ముగిసింది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) దేశీ స్టాక్ మార్కెట్లో అదేపనిగా విక్రయాలు కొనసాగించడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం రూపాయి బలహీనతకు కారణాలని విశ్లేషకులు చెపుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎఫ్పీఐలు స్టాక్ మార్కెట్ నుంచి 28 బిలియన్ డాలర్లకుపైగా వెనక్కు తీసుకున్నారు. బ్రెంట్ క్రూడ్ ధర గత కొద్ది రోజులుగా 105 డాలర్ల నుంచి 117 డాలర్ల స్థాయిని చేరడంతో రూపాయిపై ఒత్తిడి ఏర్పడిందని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది చెప్పారు. అలాగే అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ కఠిన వైఖరి, ఈక్విటీల్లో ఎఫ్పీఐల అమ్మకాలతో కేవలం ఆరు రోజుల్లో రూపాయి 100 పైసల భారీ నష్టాన్ని చవిచూసిందన్నారు.
ఈ ఏడాది చివరికల్లా 80-81 స్థాయికి
ముడి చమురు ధరలు తగ్గకపోతే రూపాయి మరింత బలహీనపడుతుందని రిలిగేర్ బ్రోకింగ్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ సుగంధ సచ్దేవా చెప్పారు. సమీప భవిష్యత్తులో ఇది 79.20 స్థాయికి తగ్గవచ్చని అంచనా వేశారు. కరెంటు ఖాతా లోటు, ద్రవ్యలోట్లు, వడ్డీ రేట్ల పెరుగుదలతో ఈ సంవత్సరాంతానికల్లా డాలరు మారకంలో రూపాయి విలువ 80-81 స్థాయికి క్షీణించవచ్చని ఆనంద్రాఠి షేర్స్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది అంచనా వేశారు.
ముడి చమురు మంట
మరో వైపు ఒపెక్ సభ్యదేశాలైన లిబియా, ఈక్వెడార్లు రాజకీయ ఆశాంతి కారణంగా చమురు ఉత్పత్తిని నిలిపివేయడంతో ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ఆగస్టు కాంట్రాక్ట్ మంగళవారం 2 శాతంమేర పెరిగి 117.20 డాలర్ల స్థాయిని చేరింది. రష్యా చమురుపై జీ 7 దేశాలు మరిన్ని ఆంక్షలు ప్రకటించవచ్చన్న అంచనాలు కూడా చమురు ధరకు ఆజ్యం పోసాయి. అమెరికాలో చమురుకు డిమాండ్ పెరగడం, చైనాలో కొవిడ్ ఆంక్షల్ని సడలించడం సైతం చమురు ధర పెరుగుదలకు కారణమై, రూపాయిపై ఒత్తిడి పెరుగుతున్నది.
ఆర్బీఐ మద్దతిస్తే అసలుకే ఎసరు
రూపాయి పతనాన్ని నిలువరించడానికి రిజర్వ్బ్యాంక్ డాలర్లను విక్రయించే చర్య దీర్ఘకాలంలో దెబ్బతీస్తుందని ఎమ్కే గ్లోబల్ రీసెర్చ్ నిపుణులు హెచ్చరించారు. రూపాయిని బలహీనపడనివ్వడమే సరైన వ్యూహమని, దీంతో కరెంట్ ఖాతా లోటు మెరుగుపడటానికి వీలు చిక్కుతుందని వారన్నారు. మొత్తం కొత్త వాస్తవాలకు అనుగుణంగా రూపాయి మారకపు రేటు స్థిరపడేలా ఆర్బీఐ చూస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఎఫ్పీఐల నిధులు
దేశీ స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం ఎఫ్పీఐలు విక్రయాలు జరుపుతుండగా, కొంతకాలం కొనుగోళ్లు చేసినప్పటికీ మొత్తం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్పీఐల నికర పెట్టుబడులు గత ఏడాది కంటే 30 బిలియన్ డాలర్ల మేర తగ్గవచ్చని యెస్ సెక్యూరిటీస్ అంచనా వేసిం ది. దీంతో 2022-23 బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఖాతా నెగిటివ్గా మారుతుందని, ఫలితంగా రూపాయి మరింత తరిగిపోతుందని బ్రోకరేజ్ సంస్థ వివరించింది.