ముంబై, జూన్ 30: రూపాయి పతనాన్ని నిలువరించడానికి రిజర్వ్బ్యాంక్ అన్నివైపుల నుంచి పోరు జరుపుతున్నా, కరెన్సీ ఎప్పటికప్పుడు కొత్త కనిష్ఠాలతో బెంబేలెత్తిస్తున్నది. కాస్తయినా ఊరట లభించడం లేదు. ఆర్బీఐ అనుసరిస్తున్న బహుముఖ వ్యూహాల్లో ఒకటి తాజాగా బెడిసికొట్టింది. రూపాయి క్షీణతను అదుపుచేసేందుకు ఇటు స్పాట్ మార్కెట్లో కేంద్ర బ్యాంక్ డాలర్లను విక్రయించడంతో పాటు అటు రూపీ-డాలర్ పెయిర్ డెరివేటివ్ ఫ్యూచర్లను కూడా విక్రయించింది. దాంతో ఫార్వర్డ్ (తదుపరి నెలల గడువుతో ట్రేడయ్యేవి) డాలర్ ప్రీమియం తగ్గిపోవడం, ఫ్యూచర్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం కేంద్ర బ్యాంక్కు సవాలుగా మారింది. రూపాయి క్షీణత కొనసాగుతున్నది. దేశీ కరెన్సీ 79 స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. వరుసగా ఏడు ట్రేడింగ్ సెషన్లలో 118 పైసల భారీ నష్టాన్ని ఇది చవిచూసింది.
అమెరికా, ఇండియాల వడ్డీ రేట్ల మధ్య వ్యత్యాసం తగ్గడం, క్రూడ్ ధరలు పెరగడం, అధిక ద్రవ్యోల్బణం, వాణిజ్యలోటు విస్త్రతంకావడం వంటి అంశాలతో రూపాయిపై ఒత్తిడి కొనసాగుతుందని ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) ట్రేడర్లు అంటున్నారు. రూపాయిని రక్షించుకోవడానికి అన్ని మార్కెట్లలోనూ ఆర్బీఐ జోక్యం చేసుకుంటున్నదని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బ్యాంకింగ్ గ్రూప్ ఎఫ్ఎక్స్ వ్యూహకర్త ధీరజ్ నిమ్ చెప్పారు. రూపాయి క్షీణతకు తక్షణం బ్రేక్లు వేసేందుకు కాకుండా, కరెన్సీ ప్రయాణించే బాట సున్నితంగా ఉంచేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకుంటే మంచిదని సూచించారు. కరెన్సీ ఒడిదుడుకుల్ని ఆపడానికే తాను జోక్యం చేసుకుంటానని, దిశను మార్చడానికి కాదని ఆర్బీఐ సైతం పేర్కొంటున్నది. ఈ క్రమంలో స్పాట్ మార్కెట్లో కొద్ది వారాల నుంచి డాలర్లను విక్రయిస్తున్నది. ఈ నేపథ్యంలో దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు ఈ ఏడాది ఇప్పటివరకూ 43 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి.
ఇదే సమయంలో రూపాయి 6 శాతం వరకూ పడిపోయింది. మరోవైపు ఫారెక్స్ నిల్వలకు రక్షణగా ఫార్వర్డ్ మార్కెట్లో ఆర్బీఐకి ఉన్న 64 బిలియన్ డాలర్ల లాంగ్ పొజిషన్ల నుంచి కొన్నింటిని విక్రయిస్తున్నంది. స్పాట్ మార్కెట్లో జరుపుతున్న అమ్మకాలతో ఏర్పడిన నష్టాల్లో కొంత భాగాన్ని పూడ్చుకునేందుకు ఫార్వర్డ్ లాంగ్ పొజిషన్లను ఆఫ్లోడ్ చేస్తున్నది. దీంతో గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంత కనిష్ఠస్థాయి 3 శాతంలోపునకు డాలర్/రూపీ ఫార్వర్డ్ ప్రీమియంలు తగ్గిపోయాయని క్వాంట్ఎకో రీసెర్చ్ ఎకానమిస్ట్ వివేక్ కుమార్ చెప్పారు. జూన్ డెరివేటివ్ కాంట్రాక్టులు ముగింపు సందర్భంగా రిజర్వ్బ్యాంక్ కొన్ని కాంట్రాక్ట్ల్ని జూలై మెచ్యూరిటీకి రోలోవర్ చేయడం రూపాయిపై ఒత్తిడిని పెంచిందని ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు.
డాలర్ల కొరతతో సతమతం
ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధుల్ని తరలించుకుపోవడం, కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో నగదు డాలర్లకు పెద్ద ఎత్తున కొరత ఏర్పడుతున్నది. దీంతో ఫారెక్స్ ట్రేడర్లు సతమతమవుతున్నారు. మార్కెట్లో డాలర్ల సరఫరా తగ్గి, రూపాయి పడిపోతున్నది. గతవారంలో ముంబైకి చెందిన బ్యాంక్లు డాలర్ల కొరతను ఎదుర్కొన్నాయని మిజుహో బ్యాంక్, ఐఎఫ్ఏ గ్లోబల్ తెలిపాయి. స్టాక్ మార్కెట్లో విక్రయాలు జరుపుతున్న విదేశీ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీలవరకూ రూపాయికి బదులుగా డాలర్లకు ఎగబడుతున్నందున కొరత ఏర్పడుతున్నదని ట్రేడర్లు అంటున్నారు. రిజర్వ్బ్యాంక్ తన రిజర్వుల నుంచి చేస్తున్న డాలర్ సరఫరాలు వాటికున్న డిమాండ్ను తీర్చలేకపోతున్నాయి. నగదు డాలర్ల కొరతతో పాటు ఫార్వర్డ్ ప్రీమియంలు తగ్గడంతో రూపాయి అదేపనిగా పతనమవుతున్నదని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎకనామిస్ట్ మాధవి ఆరోరా చెప్పారు.
కొనసాగుతున్న రుపీ పతనం
దేశీయ కరెన్సీ పతనం కొనసాగుతున్నది. ఇప్పటికే ఆల్టైం కనిష్ఠ స్థాయికి జారుకున్న మారకం విలువ గురువారం మరో 3 పైసలు తగ్గి 79.06కి జారుకున్నది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరగడంతోపాటు విదేశీ ఫండ్లు తరలిపోవడం రూపాయి పతనానికి కారణం. 78.92 వద్ద ప్రారంభమైన డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఇంట్రా డేలో 78.90 గరిష్ఠ స్థాయిని తాకింది. ఒక దశలో 79.07 స్థాయికి పడిపోయి చివరకు 79.06 వద్ద ముగిసింది.