ముంబై, నవంబర్ 1: ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్య ప్రభావం రూపాయిపై తీవ్రంగా పడుతున్నది. ద్రవ్యోల్బణం అదుపు తప్పడం, ద్రవ్యలోటు విస్త్రతంకావడం, ఎగుమతులు పడిపోవడం, వాణిజ్యలోటు అంతకంతకూ పెరిగిపోవడం, తయారీ, మౌలిక పరిశ్రమలు గాడితప్పడం, విదేశీయులు దేశీ మార్కెట్ నుంచి నిధులు తరలించుకుపోవడం వంటి అంశాలన్నీ కరెన్సీని కుదేలుచేస్తున్నాయి. కొద్ది రోజులుగా ఏ మాత్రం కోలుకుకుండా బలహీనంగా ట్రేడవుతున్న రూపాయి..వరుసగా బలహీన ఆర్థిక గణాంకాలు వెలువడటంతో బుధవారం ఒక్కసారిగా జారిపోయింది. బుధవారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మారకంలో 83.26 వద్ద బలహీనంగా ప్రారంభమైన భారత్ కరెన్సీ క్రమేపీ క్షీణించి ఇంట్రాడేలో 83.35 వద్దకు పడిపోయింది. ప్రొవిజనల్గా ఆల్టైమ్ కనిష్ఠస్థాయి 83.33 వద్ద ముగిసినప్పటికీ, తుది డాటా ప్రకారం క్రితం ట్రేడింగ్ రోజుతో పోలిస్తే 4 పైసలు క్షీణించి చరిత్రాత్మక కనిష్ఠస్థాయి 82.28 వద్ద నిలిచింది. ఈ ఏడాది సెప్టెంబర్ 18న ముగింపు 83.32 ఇప్పటివరకూ రికార్డు కనిష్ఠస్థాయి.
దేశీయ నిరుత్సాహకర ఆర్థికాంశాలకు తోడు అం తర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలపడటం, భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా నిధులు తరలించుకుపోవడం, మధ్యప్రాచ్య యుద్ధ ఉద్రిక్తతలు తదితర ప్రతికూల అంశాల నడుమ రిజర్వ్బ్యాంక్ ప్రభుత్వ బ్యాంక్ల సాయంతో డాలర్లను విక్రయించి, రూపాయికి మద్దతు ఇచ్చినప్పటికీ భారత్ కరెన్సీ నిలబడలేదని ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు. యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తాజా సమీక్షలో వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో డాలర్ బలపడుతున్నదని, దీంతో భారత్తో సహా పలు వర్థమాన దేశాల కరెన్సీలు తగ్గుతున్నాయని బీఎన్పీ పారిబా రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌధరి చెప్పారు. డాలర్ ఇండెక్స్ 10 నెలల గరిష్ఠస్థాయి 106.87 వద్ద ట్రేడవుతున్నది.
ఇటీవల వెలువడిన దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు నిరుత్సాహంగా ఉండటం, ఎఫ్పీఐల అమ్మకాలు రూపాయిపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు గత ఏడాదితో పోలిస్తే 37 శాతం నుంచి 39 శాతానికి పెరగడం, ఆర్థిక వ్యవస్థకు కీలకమైన మౌలిక రంగాల వృద్ధి రేటు సెప్టెంబర్ నెలలో 8 శాతానికి పరిమితం కావడం ఆందోళనకర అంశాలేనని వారంటున్నారు. అలాగే భారత్లో తయారీ పరిశ్రమ సమీప భవిష్యత్తులో నీరసించబోతుందనడానికి సంకేతంగా ఎస్ అండ్ పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్ఛేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) అక్టోబర్లో 55.5 పాయింట్లకు దిగజారినట్టు తాజాగా వెలువడిన డేటా సైతం రూపాయికి షాక్ ఇచ్చిందని ఫారెక్స్ నిపుణులు వివరించారు. ఇది సెప్టెంబర్లో 57.5 పాయింట్లు ఉంది. బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) రూ.1,816 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించినట్టు ఎక్సేంజీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 283 పాయింట్లు క్షీణించి నాలుగు నెలల కనిష్ఠస్థాయి 63,591 పాయింట్ల వద్ద ముగిసింది.