Rules Change from October | చరిత్ర కాలగర్భంలో మరొక నెల కలిసిపోతున్నది. సెప్టెంబర్ నెల మరో మూడు రోజుల్లో ముగిసి, అక్టోబర్ నెల ప్రారంభం కాబోతున్నది. ఇటీవల ప్రతి నెలలోనూ సగటు భారతీయుడి జీవన శైలి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు మార్పులు వచ్చేస్తున్నాయి. అలాగే అక్టోబర్లోనూ డెబిట్/ క్రెడిట్ కార్డుల యూజర్లకు టోకెనైజేషన్, ఐటీ చెల్లించే వారికి అటల్ యోజన పెన్షన్ పథకంలో నో సబ్స్క్రిప్షన్, పలు బ్యాంకుల స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్లో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దామా..!
ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. తదనుగుణంగా సైబర్ మోసాలు చోటు చేసుకుంటున్నాయి. కనుక డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ( debit and credit cards ) యూజర్ల సేఫ్టీ ట్రాన్సాక్షన్స్ కోసం భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) టోకెనైజేషన్ ( tokenization ) పాలసీ తీసుకొస్తున్నది. ఇప్పటివరకు ఆన్లైన్ లావాదేవీల్లో యూజర్లు తమ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలు, వ్యక్తిగత డేటా నమోదు చేయాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి డెబిట్ కార్డుకు ఒక టోకెన్, క్రెడిట్ కార్డుకో టోకెన్ నంబర్ జారీ చేస్తాయి సంబంధిత బ్యాంకులు.
అక్టోబర్ ఒకటో తేదీ నుంచి సదరు టోకెన్ నంబర్లతోనే ఆన్లైన్ లావాదేవీలు జరుపుకోవాలి. టోకెనైజేషన్కు ముందుకు రాని కస్టమర్లు ప్రతి లావాదేవీ ( transaction ) కి తమ పూర్తి డేటా నమోదు చేయాల్సి వస్తుంది. టోకెనైజేషన్ వల్ల డెబిట్ లేదా క్రెడిట్ కార్డు యూజర్ల డేటా సురక్షితంగా ఉంటుంది. టోకెనైజేషన్ వల్ల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల యూజర్లకు కొత్త లావాదేవీల విధానం అనుభవంలోకి రానున్నది.
ప్రజల భవిష్యత్ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన స్కీమ్ Atal Pension Yojana తీసుకొచ్చింది. ఇందులో 18-40 ఏండ్ల లోపు వారంతా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. కానీ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ విధానంలో మార్పులు వస్తున్నాయి. ఆదాయం పన్ను చెల్లింపుదారులు ఇక నుంచి అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరడానికి అనుమతించడం లేదు. ఈ విషయాన్ని ఇంతకుముందే కేంద్రం వెల్లడించింది. ఈ పథకం కింద సబ్స్క్రిప్షన్ పొందిన వారికి నెల వారీగా రూ.5000 వరకు పెన్షన్ ఇవ్వడం లక్ష్యం.
ప్రతి నెలా ఒకటో తేదీన కేంద్ర చమురు సంస్థలు వంట గ్యాస్ ధరలు సవరిస్తుంటాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టింది. 14.2 కిలోల వంటింటి గ్యాస్ సిలిండర్, 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలు సవరిస్తారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా కేంద్ర చమురు సంస్థలు వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తాయని పౌరులు, ప్రత్యేకించి గృహిణులు ఆశిస్తున్నారు. అలా గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తే పండుగల సీజన్లో అత్యధికులకు రిలీఫ్ లభిస్తుందని చెబుతున్నారు.
ప్రతి ఒక్కరూ తమ కుటుంబ దీర్ఘ కాలిక అవసరాల కోసం వివిధ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్లో పెట్టుబడి పెడుతుంటారు. దీర్ఘ కాలికంగా పెట్టుబడి అంటే మ్యూచువల్ ఫండ్స్ బెటర్ రూట్. అలా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ కోసం కేంద్రం కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. అక్టోబర్ ఒకటో తేదీ లోగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ నామినీ పేరు తప్పనిసరిగా నమోదు చేయాల్సిందే. అలా నామినీ పేరు ఇవ్వకుంటే డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ లేదా నామినీ పేరు చేర్చకున్నా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడానికి అనుమతించరు.
ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్కు నామినీ పేరు చేర్చేందుకు జూలై నెలాఖరు వరకే ఉన్న గడువును కేంద్రం అక్టోబర్ ఒకటో ఏతదీ వరకు పొడిగించింది. మ్యూచువల్ఫండ్స్ లావాదేవీలు నిర్వహిస్తున్న అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీ).. నామినేషన్ ఆప్షన్/ డిక్లరేషన్ ఫామ్ను ఆఫ్లైన్, ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నాయి. ఆఫ్లైన్లో ఇన్వెస్టర్ సిగ్నేచర్, ఆన్లైన్లో ఈ-సైన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది.
పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై వడ్డీరేట్లు సవరించాయి. అలాగే సీనియర్ సిటిజన్ల కోసం స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) పథకాలు తెచ్చాయి. వాటిల్లో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీ పేరిట 2020 మే 18న ప్రారంభించింది. ఐదేండ్ల నుంచి పదేండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. ఇది బ్యాంక్ స్టాండర్డ్ వడ్డీరేటు 5.75 శాతం కంటే ఎక్కువ. ఈ స్కీమ్ సెప్టెంబర్ నెలాఖరుతో ముగుస్తున్నది. ఎన్నారైలు మినహా దేశీయ పౌరులు ఈ పథకం కింద రెన్యూవల్స్ను చేర్చొచ్చు.
మరో ప్రైవేట్ బ్యాంక్ ఐడీబీఐ బ్యాంక్.. సీనియర్ సిటిజన్ల కోసం `ఐడీబీఐ నమాన్ సీనియర్ సిటిజన్ డిపాజిట్` పేరిట స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకం తెచ్చింది. గత ఏప్రిల్ 20న ప్రారంభించిన ఈ పథకాన్ని సెప్టెంబర్ నెలాఖరుతో ముగుస్తుంది. ఏడాది నుంచి 10 ఏండ్ల లోపు మెచ్యూరిటీ టెన్యూర్తో ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్పెషల్ డిపాజిట్ పథకం కింద అదనపు వడ్డీరేటుతో 0.50 శాతంతోపాటు మరో 0.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నారు.
స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్ చేసే వారు టూ-ఫ్యాక్టర్ అథంటికేషన్ పూర్తి చేయాలి. అప్పుడు మాత్రమే వారు తమ డీమ్యాట్ అకౌంట్లో లాగిన్ కావచ్చు. ఒకవేళ టూ-ఫ్యాక్టర్ అథంటికేషన్ పూర్తి చేయని వారు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి డీమ్యాట్ అకౌంట్లో లాగ్ఇన్ కాలేరు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సభ్యులు తమ డీమ్యాట్ అకౌంట్లో లాగిన్ కావడానికి బయోమెట్రిక్ అథంటికేషన్ను అథంటికేషన్ ఫ్యాక్టర్గా వాడొచ్చు. సెకండ్ అథంటికేషన్గా నాలెడ్జ్ ఫ్యాక్టర్ ( knowledge factor ) ను వాడొచ్చు. ఇది పాస్వర్డ్గా, పిన్ నంబర్గా వాడుకోవచ్చు. ఇది కేవలం యూజర్ మాత్రమే తెలుస్తుంది.