RSS on Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిరిండియా సీఈవోగా ఇల్కర్ ఐకీ నియామకాన్ని ఆమోదించొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆరెస్సెస్) అనుబంధ స్వదేశీ జాగరణ్ మంజ్ (ఎస్జేఎం) అభ్యర్థించింది. ఈ నెల 14న ఇల్కర్ ఐసీని ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా నియమిస్తూ టాటా సన్స్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టర్కీలో తన మునుపటి రాజకీయ సంబంధాలను ఉటంకిస్తూ.. ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫసర్గా ఇల్కర్ ఐసీ నియామకాన్ని అడ్డుకోవాలని ఎస్జేఎం కోరింది.
ప్రస్తుత టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ 1994లో ఇస్తాంబుల్ మేయర్’గా పనిచేసినప్పుడు అతనికి సలహాదారుగా ఇల్కర్ ఐసీ పని చేశారు. ఈ నేపథ్యంలో ఇల్కర్ ఐకీ పూర్వాపరాలపై పూర్తిగా దర్యాప్తు చేయాలని ఎస్జేఎం కోరింది. దీనిపై ఇల్కర్ ఐకీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. పూర్తిగా అప్పుల ఊబిలో చిక్కుకున్న ఎయిరిండియాను గత నెల 27న టాటా సన్స్ టేకోవర్ చేసింది. నాటి నుంచి ఎయిరిండియాకు జవసత్వాలు కలిగించేందుకు టాటా సన్స్ చర్యలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో ఎయిరిండియా సీఈవోగా ఇల్కర్ ఐకీ నియామకంపై ఎస్జేఎం అభ్యంతరంపై టాటా సన్స్ స్పందించలేదు. పాక్ పట్ల టర్కీ సానుభూతితో ఉన్నందున ఇల్కర్ ఐకీ నియామకాన్ని ఆమోదించొద్దని ఎస్జేఎం కన్వీనర్ అశ్వినీ మహాజన్ కేంద్రాన్ని కోరారు. దేశంలోని విమానయాన సంస్థ సారధిగా విదేశీయుడి నియామకానికి ప్రభుత్వ అనుమతి అవసరం అని పేర్కొన్నారు.