Rolls-Royce EV Spectre | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) రంగంలో పోటీలోకి వచ్చేసింది. ఆల్ ఎలక్ట్రిక్ వెహికల్ ‘స్పెక్ట్రే’ పేరుతో రూపొందించిన ఈ బ్రిటన్ కార్ల కంపెనీ వచ్చే ఏడాది చివరికల్లా బుకింగ్స్ చేసుకున్న వారికి డెలివరీ చేయనున్నది. దీని ధర ఎంత అన్నది బయట పెట్టలేదు కానీ రూ. 6.95 కోట్లకంటే ఎక్కువే ఉండొచ్చునని అంచనా. ‘స్పెక్ట్రే’ మోడల్ కారును బుధవారం ఆవిష్కరించింది. ఈ కారు కేవలం 4.5 సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకెళ్తుంది.
520 కి.మీ. దూరం ప్రయాణించగల సామర్థ్యంతోపాటు డబుల్ డోర్, ఫోర్ సీటర్ కారు ఇది. 900ఎన్ఎం సామర్థ్యంగల బ్యాటరీ, 577బీహెచ్పీ విద్యుత్ను వెలువరిస్తుంది. 23 అంగుళాల వీల్స్తో డిజైన్ చేశారు. తుది దశ టెస్టింగ్ కసరత్తు జరుగుతున్నది. వచ్చే ఏడాది చివరిల్లో మార్కెట్లోకి ఆవిష్కరించినప్పుడు మాత్రమే రోల్స్ రాయిస్ ‘స్పెక్ట్రే’ ఫీచర్లు తెలుస్తాయి. ఇప్పుడు డిజైన్ చేసిన ఫీచర్లలో కొన్ని మార్చే అవకాశాలు లేకపోలేదు.
స్ప్లిట్ హెడ్లైట్, 22 ఎల్ఈడీ రేర్ లైటింగ్తో వస్తోంది రోల్స్ రాయిస్ స్పెక్ట్రే ఈవీ. దీని మాదిరిగా ఏ కారుకూ లార్జ్ గ్రిల్లేలు ఉండవు. తలుపులు చాలా పొడవుగా డిజైన్ చేశారు. ఇంటిరియర్ లగ్జరీ లుక్తో వస్తుంది. ఈ కారు ధర రోల్స్ రాయిస్ కుల్లినన్ ఎస్యూవీ, రోల్స్ రాయిస్ ఫాంటోమ్ వీఐఐఐ సెడాన్ మోడల్ కార్ల ధరల మధ్య ఉంటుందని సంస్థ యాజమాన్యం పేర్కొంది.
కుల్లినన్ ఎస్యూవీ కారు ధర రూ. 6.95 కోట్లతోపాటు గంటకు 6.6 కి.మీ. స్పీడ్ వెళుతుంది. ఫాంథోమ్ వీఐఐఐ సెడాన్ కారు రూ. 9.50 కోట్లు పలుకడంతోపాటు గంటకు 7.1 కిలోమీటర్ల మైలేజీ ఉంటుంది. భారత్లో ఈ కారు లాంచ్ చేస్తే ధర రూ.7- 9 కోట్ల మధ్య ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. 2030 నాటికి రోల్స్ రాయిస్ పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థగా మారుతుందని ఆ సంస్థ సీఈవో టోర్స్టెన్ ముల్లర్ అట్వాస్ పేర్కొన్నారు.