Gold Jewellery | భారతీయలకు అందునా మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం.. ప్రతి మహిళకూ ఆభరణాలపై మోజు ఉంటుంది. పెండ్లిండ్లు, శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయడంతోపాటు తమకు ఉన్న ఆభరణాలు ధరించడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త మోడల్ ఆభరణాలపై మనస్సు పారేసుకునే అతివలు.. ఇప్పుడు పురాతన కాలం నాటి డిజైన్లు గల ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రత్యేకించి పెండ్లిండ్లలో నవ వధువు కోసం వారి తల్లిదండ్రులు బంగారంపై ఎంత వెచ్చించడానికైనా వెనుకాడరు. ద్రవ్యోల్బణం ప్రభావంతో రోజురోజుకు బంగారం ధర పెరుగుతున్నా ఆభరణాల కొనుగోలుకు మొగ్గుతున్నారు. గతేడాది పెండ్లిండ్లలో ఆభరణాల కొనుగోలుకు తల్లిదండ్రులు సగటున రూ.5-7 లక్షలు ఖర్చు చేస్తే, ఈ ఏడాది రూ.10 లక్షలు ఖర్చు చేస్తున్నారని ముంబై జవేరి బజార్ జ్యువెల్లరీ వ్యాపారులు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా వధువులు పురాతన డిజైన్లపై మోజు పెంచుకుంటున్నారని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సాయం మెహ్రా తెలిపారు. గత నెల 23 నుంచి ఈ నెల 15 వరకు 35 లక్షల వివాహాలు జరిగాయి. ఈ సీజన్లో కోల్కతా జ్యువెల్లరీకి మంచి గిరాకీ వచ్చిందన్నారు. పెండ్లిండ్ల కోసం ఈ నెల 13కల్లా బంగారం కొనుగోళ్లు నిలిచిపోయాయన్నారు. పెండ్లిండ్ల సీజన్ నేపథ్యంలో ఈ ఏడాది పది గ్రాముల బంగారం (24 క్యారెట్స్) ధర రూ.64 వేల వరకూ వెళుతుందన్నారు.
దక్షిణ భారత దేశంలో పురాతన జ్యువెల్లరీకి డిమాండ్ పెరిగిందన్నారు సాయం మెహ్రా. గతేడాదితో పోలిస్తే 15 శాతం గిరాకీ ఎక్కువైందని చెప్పారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ మొత్తంలో బంగారం, ఆభరణాల కొనుగోళ్లు జరిగాయి. స్వచ్ఛమైన బంగారం ఆభరణాల కోసం ప్రజలు మొగ్గు చూపుతుండటంతో సేల్స్ పెరుగుతున్నాయి.
తూర్పు రాష్ట్రాల పౌరులు, కుటుంబాలు కూడా బంగారం ఆభరణాల కోసం తమ బడ్జెట్ 10-15 శాతం పెంచుకుంటున్నారని సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ సువంకర్ సేన్ తెలిపారు. బంగారం, వజ్రాభరణాల కోసం 15 శాతం బడ్జెట్ కేటాయించినా.. ఆభరణాల కొనుగోలులో వజ్రాభరణాలకు గిరాకీ పెరిగిందన్నారు.