న్యూఢిల్లీ, జూన్ 20: దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు అన్ని రంగాలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రుతుపవనాలు వచ్చినట్టే వచ్చి వెళ్లిపోవడంతో ఇప్పటి వరకు దేశీయంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురియలేదు. ఈ దెబ్బకు దేశీయ ఆటోమొబైల్ రంగంపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది.
ప్రధానంగా కార్ల విక్రయాలతోపాటు ద్విచక్ర వాహన అమ్మకాలు సింగిల్ డిజిట్కు పరిమితం కానున్నదని వెల్లడించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహన విక్రయాలు 3 శాతం నుంచి 5 శాతం వరకు మాత్రమే వృద్ధి నమోదుకావచ్చునని అంచనావేస్తున్నది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు ధరలు భగ్గుమనడం, మరోవైపు వాహన ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచడం కూడా విక్రయాల వేగానికి కళ్లెం వేయనున్నాయని పేర్కొన్నది.
మరోవైపు, ఈ ఏడాది కమోడిటీ ఉత్పత్తుల ధరలు భగ్గుమనడం, వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కొనుగోలుదారులు వేచిచూసే దోరణి అవలభించే అవకాశాలున్నాయని తెలిపింది. ప్రస్తుతం ద్విచక్ర వాహన ఇండస్ట్రీ ఆశాజనక పనితీరు కనబరుస్తున్నప్పటికీ భవిష్యత్తులో డిమాండ్ పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించింది. ఈ రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నదని, వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, సరఫరా వ్యవస్థ కోసం అధికంగా నిధులు వెచ్చించడంతో వాహన తయారీ సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నదని పేర్కొన్నది.
ఇంధన ధరలు భగ్గుమనడంతో విద్యుత్తుతో నడిచే వాహనాలకు ఎనలేని డిమాండ్ నెలకొన్నది. మే నెలలో దేశీయంగా 1,72,148 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. కిందటేడాది ఇదే నెలలో అమ్ముడైన దాంతో పోలిస్తే 71.7 శాతం అధికం. ఒకే నెలలో ఇంతటిస్థాయిలో అమ్ముడవడం ఇదే తొలిసారి. మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా 8.9 శాతానికి పెరిగింది.