హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): విమాన ప్రయాణం.. వెళ్లేది వచ్చేది ఒక్కరే.. కానీ వారి వెంట వచ్చే వారు పదుల సంఖ్యలో ఉంటున్నారు. స్నేహితులు, బంధువులు అంతా వెళ్లి సెండాఫ్ ఇస్తుంటారు. అదే సమయంలో రీసివింగ్ చేసుకోవడానికి అయితే చెప్పవలసిన అవసరం లేదు. ఇక రాజకీయ నాయకుల విషయంలో హడావిడి అంత ఇంతకాదు. నాయకులు వస్తున్నారంటే అధిక సంఖ్యలో స్వాగతం పలికేందుకు అనుచరులు రెడీ అవుతుంటారు. ఇలాంటి చర్యలతో విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నాయని రాజీవ్ గాంధీ విమానాశ్రయ సిబ్బంది వెల్లడించారు. ఎంట్రీ పాయింట్స్, లగేజ్ చెకింగ్ తదితర విభాగాల వద్ద క్యూలైన్స్ను సమన్వయం చేసుకోవడంతో పాటు వారి వెంట వచ్చే వారిని నియంత్రించడంలో సిబ్బందికి తలనొప్పిగా మారింది. వీరితో పాటు ప్రస్తుతం ఎన్నికల హడావిడి, మరోవైపు పంద్రాగస్టు, ఇంకోవైపు విదేశీ చదువుల కోసం విద్యార్థుల రాకపోకలతో పేరేంట్స్ హడావిడి పెరిగిన నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో సందడే సందడి నెలకొంటున్నది. వీటిని దృష్టిలో ఉంచుకుని విమాన ప్రయాణికులు వారి వెంట తీసుకొచ్చే వారి సంఖ్య తగ్గించుకోవాలని సూచించింది. ప్రతీ ఒక్కరిని చెకింగ్ చేయడం తలకు మించిన భారంగా సిబ్బంది పేర్కొంది. ప్రయాణికులు తమకు తోడ్పాటు అందిస్తారని ఆశిస్తున్నామని చీఫ్ ఏయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ తెలిపారు.