శంషాబాద్ రూరల్, మార్చి 11: గతేడాదికిగాను జీఎంఆర్ హైదరాబాద్ (శంషాబాద్) అంతర్జాతీయ విమానాశ్రయం.. ప్రతిష్ఠాత్మక ఎయిర్పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్(ఏసీఐ) వరల్డ్స్ ఎయిర్పోర్టు సర్వీస్ క్వాలిటీ(ఏఎస్క్యూ) అవార్డును సాధించింది. ఆసియా-పసిఫిక్ రీజియన్లో 15-25 మిలియన్ ప్యాసింజర్స్ విభాగంలో పరిమాణం, రీజియన్పరంగా ఉత్తమ ఎయిర్పోర్టుగా ఎంపికైందని శుక్రవారం జీఎంఆర్ వర్గాలు తెలిపాయి. కాగా, ఎయిర్పోర్టులో ప్రయాణికుల సంతృప్తి, వ్యాపార ప్రదర్శన, సేవల నాణ్యతలకు ఏఎస్క్యూ సర్వేనే ప్రామాణికం. ఈ సందర్భంగా ఎయిర్పోర్టు సీఈవో ప్రదీప్ పనిక్కర్ మాట్లాడుతూ.. ఏసీఐ నిర్వహిస్తున్న వార్షిక ఏఎస్క్యూ సర్వేల్లో ప్రయాణికులు ఉత్తమ ఎయిర్పోర్టుగా ఏటేటా గుర్తించడం సంతోషకరమన్నారు. కరోనా నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు.