Retail Inflation | కూరగాయలు, ఆహార వస్తువుల ధరలు పెరిగి పోవడంతో జూలై రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ట స్థాయికి చేరుకుని 7.44 శాతంగా నమోదైంది. ఇంతకుముందు 2022 ఏప్రిల్లో 7.79 శాతంగా రికార్డైంది. గతేడాది మే నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి. గత జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 4.81 శాతం అని కేంద్రం సోమవారం జారీ చేసిన ప్రకటనలో తెలిపింది.
జూన్లో వినియోగదారుల ధరల సూచీ (సీఎఫ్ఫీఐ) 4.49 శాతం నుంచి 11.51 శాతానికి దూసుకెళ్లింది. రూరల్ ద్రవ్యోల్బణం 7.63 శాతం, పట్టణ ద్రవ్యోల్బణం 7.20 శాతంగా రికార్డైంది. వరుసగా నాలుగు నెలలుగా ఆర్బీఐ నియంత్రణ స్థాయి 2-6 శాతం మధ్యే వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) నమోదవుతూ వచ్చింది. కానీ నెల రోజులుగా కూరగాయలు ప్రత్యేకించి టమాటల ధరలు శరవేగంగా పెరిగిపోయాయి.
ఏడాది క్రితంతో పోలిస్తే కూరగాయల ధరలు 0.93 శాతం నుంచి 37.34 శాతం పెరిగాయి. ఆహారం, శీతల పానీయాల ధరలు 4.63 శాతం నుంచి 10.57 శాతానికి, తృణ ధాన్యాల ధరలు 12.71 శాతం నుంచి 13.04 శాతానికి దూసుకెళ్లాయి. ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం 3.67 శాతంగా కొనసాగుతున్నది.