న్యూఢిల్లీ, జూలై 12: గత కొన్ని నెలలుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న రిటైల్ ధరల సూచీ స్వల్పంగా తగ్గింది. జూన్ నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం 7.01 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాలు తగ్గడంతో సూచీ స్వల్పంగా దిగొచ్చింది. అయినప్పటికీ రిజర్వుబ్యాంక్ నిర్దేశించుకున్నదానికంటే అధికంగానే నమోదైంది. మే నెలలో ధరల సూచీ 7.04 శాతంగా ఉన్నది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 6.26 శాతంతో పోలిస్తే మాత్రం భారీగా పెరిగింది. ఆహార పదార్థాలకు సంబంధించిన సూచీ 7.97 శాతం నుంచి 7.75 శాతానికి దిగిరావడం ఇందుకు కలిసొచ్చిందని జాతీయ గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
పారిశ్రామికం పరుగు
దేశీయ పారిశ్రామిక రంగం పరుగు అందుకున్నది. మే నెలలో పారిశ్రామిక రంగంలో 19.6 శాతం వృద్ధి నమోదైందని జాతీయ గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. తయారీ రంగం 20.6 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, గనులు 10.9 శాతం, పవన్ 23.5 శాతం చొప్పున పెరిగాయి. మే 2021లో నమోదైన 27.6 శాతంతో పోలిస్తే మాత్రం భారీగా తగ్గింది.