ముంబై, జూన్ 27: అధిక ద్రవ్యోల్బణంతో కూనరిల్లుతున్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కారణంగా ఓ వైపు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు దేశం నుంచి తరలివెళ్లడం, మరోవైపు రూపాయి విలువ పతనంకావడంతో భారత్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు ఆవిరైపోతున్నాయి. వరుసగా మూడో వారంలోనూ క్షీణించిన ఇవి జూన్ 17తో ముగిసిన వారంలో ఏకంగా 5.87 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. మూడు వారాల్లో ఈ నిల్వలు 10.78 బిలియన్ డాలర్లు తగ్గడంతో మొత్తం నిల్వలు 590.59 బిలియన్ డాలర్ల వద్దకు పడిపోయాయి. దిగుమతులకు అత్యవసరమైన ఈ విదేశీ మారక నిల్వలు హరించుకుపోవడానికి పలు అంశాల్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. అవి..
విదేశీ పెట్టుబడుల తరలింపు
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) 2021 అక్టోబర్ నుంచి భారత్ స్టాక్ మార్కెట్ నుంచి వారి పెట్టుబడుల్ని అదేపనిగా ఉపసంహరించుకుంటున్నారు. దేశం వద్ద విదేశీ మారక నిల్వలు తగ్గుదలకు ఇది ప్రధాన కారణం. ఈ ఏడాది ఇప్పటవరకూ ఎఫ్పీఐలు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.2.13 లక్షల కోట్లు తరలించుకెళ్లారు. ప్రస్తుత నెల జూన్ 24 వరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్స్ నుంచి రూ. 45,841 కోట్లు ఉపసంహరించుకున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్, ఇతర దేశాల కేంద్ర బ్యాంక్లు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం, అధిక క్రూడ్ ధరలు, కరెన్సీ ఒడిదుడుకులతో ఎఫ్పీఐలు వర్థమాన దేశాల మార్కెట్ ఆస్తుల నుంచి నిధులు వెనక్కు తీసుకుంటున్నారని యెస్ సెక్యూరిటీస్ ఈక్విటీ అనలిస్ట్ హితేశ్ జైన్ తెలిపారు. ఏ స్థాయి వరకూ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ఉంటుంది? అమెరికాలో బాండ్ ఈల్డ్స్ ఏ మేరకు పెరుగుతాయి? అనే అంశాలపై స్పష్టత ఏర్పడిన తర్వాతే తిరిగి ఎఫ్పీఐల పెట్టుబడులు దేశంలోకి వస్తాయని జైన్ వివరించారు.
దిగుమతుల దెబ్బ
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఏర్పడిన సరఫరా అడ్డంకులు, అంతర్జాతీయ ద్రవ్యోల్బణం సైతం భారత్ విదేశీ మారక నిల్వల్ని ప్రభావితం చేస్తున్నది. క్రూడాయిల్, వంటనూనెల ధరలు పెరగడంతో వీటి దిగుమతులకు అధిక డాలర్లను చెల్లించాల్సి వస్తున్నది. దిగుమతి చేసుకునే ఇతర కమోడిటీలకు సైతం ఇదే రీతిలో మారకం ఖర్చవుతున్నది. ఈ అంశాలన్నీ దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వల్ని తగ్గించివేస్తున్నాయి.
ఆగని రూపాయి పతనం
డాలర్ మారకంలో రూపాయి విలువ అదేపనిగా పడిపోవడం కూడా దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వల క్షీణతకు కారణమవుతున్నది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఫిబ్రవరిలో మొదలైనపుడు రూపాయి విలువ 73-74 స్థాయిలో ఉండేది. అప్పటి నుంచి క్రమేపీ తగ్గుతూ పలు దఫాలు రికార్డు కనిష్ఠస్థాయిల్ని నమోదు చేసింది. ఇది 78 దిగువకు జారిపోయి 78.40 స్థాయిని సైతం తాకింది. రూపాయి పతనాన్ని నిలువరించడానికి రిజర్వ్బ్యాంక్ కొద్ది నెలలుగా ఇంటర్బ్యాంక్ ఫారిన్ కరెన్సీ (ఫారెక్స్) మార్కెట్లో జోక్యం చేసుకుని డాలర్లను విక్రయిస్తున్నది. ఇలా విదేశీ కరెన్సీ రిజర్వ్ల నుంచి ఆర్బీఐ డాలర్లను తీసి, విక్రయించడమూ విదేశీ మారక నిల్వలు పడిపోవడానికి కారణమవుతున్నది.