ముంబై, మే 4: రుణాలను మాఫీ చేయిస్తామంటూ జరిగే తప్పుడు ప్రచారాలతో జాగ్రత్తని, ఇలాంటి మోసపూరిత హామీలను ఇచ్చే వ్యక్తులు, సంస్థలకు దూరంగా ఉండాలని ప్రజలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అప్రమత్తం చేసింది. నేరుగా లేదా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా అమాయకులను అక్రమార్కులు మోసం చేస్తున్నారని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో సెంట్రల్ బ్యాంక్ ఒకింత ఆందోళన వ్యక్తం చేసింది.
2023 డిసెంబర్లోనూ ఇదే తరహా సూచనను చేశామని గుర్తుచేసిన ఆర్బీఐ.. ఈ మోసాల వల్ల సాధారణ ప్రజానీకమేగాక, సక్రమంగా నడుస్తున్న దేశీయ రుణ వ్యవస్థ సైతం గాడితప్పే ప్రమాదం ఉందన్నది. ఆర్థిక సంస్థల్ని అస్థిరపర్చడమేగాక, డిపాజిటర్ల ప్రయోజనాలూ దెబ్బతింటాయన్నది. కాబట్టి బ్యాంకులు/బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల్లోని బకాయిలను రద్దు చేయిస్తామన్న మాటల్ని నమ్మి, ఎవరికి ఏవిధంగానూ సొమ్మును చెల్లించరాదని ప్రజలను కోరింది. అలాగే మాయమాటలతో ఇలాంటి మోసాలకు తెగబడితే చట్టప్రకారం కఠిన శిక్షలకు అర్హులవుతారని కేటుగాళ్లను రిజర్వ్ బ్యాంక్ ఈ సందర్భంగా హెచ్చరించింది.