న్యూఢిల్లీ, నవంబర్ 2: తాము ముందుగానే వడ్డీ రేట్లను పెంచిఉంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణబాట పట్టేదని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం నిర్దేశిత లక్ష్యం 6 శాతాన్ని మించి కొద్దినెలలుగా కొనసాగుతున్న ందున ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి సంజాయిషీ లేఖను రాయాల్సిన నేపథ్యంలో దాస్ ఈ వ్యాఖ్య చేశారు. బుధవారం ఒక బ్యాంకర్ల సదస్సులో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ ద్రవ్యోల్బణంపై ప్రభుత్వం తమకు నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేర్చడంలో వైఫల్యాన్ని అంగీకరించారు. ముందుగానే ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తే ఆర్థిక వ్యవస్థకు ముప్పు ఏర్పడుతుందని భావించామన్నారు. ఆ ముప్పు ఏర్పడకుండా తాము చూశామన్నారు.
ఈ ఏడాది మే నెలలో ఆర్బీఐ రేట్ల పెంపును ప్రారంభించింది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా అంతకుముందుగానే ఆర్బీఐ చర్యలు తీసుకోవాల్సిందన్న విమర్శలు ఆర్థిక నిపుణుల నుంచి వెలువడ్డాయి. వరుసగా తొమ్మిది నెలలుగా ద్రవ్యోల్బణం 6 శాతంపైగా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని నెరవేర్చడంలో వైఫల్యాన్ని, అందుకు కారణాల్ని, తీసుకున్న చర్యల్ని వివరిస్తూ ప్రభుత్వానికి లేఖ రాసేందుకు ఆర్బీఐ పాలసీ కమిటీ గురువారం సమావేశమవుతుందని శక్తికాంత్ దాస్ చెప్పారు.
మహాభారతంలో వేగంగా తిరుగుతున్న చేప కన్నును చేధించడానికి అర్జునుడు దృష్టిపెట్టిన రీతిలోనే ద్రవ్యోల్బణాన్ని చూస్తూ ఉండాలన్నది రిజర్వ్బ్యాంక్ అభిలాష అని దాస్ చెప్పారు. ‘అర్జునుడి నైపుణ్యానికి ఎవరూ సరితూగరు. కానీ ద్రవ్యోల్బణాన్ని అర్జునుడి దృష్టితో చూడాలన్నది తమ అభిమతమన్నారు. అర్జునుడు గురిపెట్టేటపుడు మత్స్యం ఎంత వేగంతో తిరుగుతున్నది, గాలివాటం ఎలా ఉన్నది, దిగువన నీటికొలనులో తరంగాల తీవ్రత ఎంత, రాజసభలో వెలువడుతున్న రణగొణధ్వనుల తీవ్రత వంటి అంశాలన్నింటినీ విశ్లేషించాడన్నారు. ఇదేరీతిలో అన్ని కోణాల్లోనూ ద్రవ్యోల్బణాన్ని గమనిస్తామన్నారు.