EPF-Aadhar link | ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) సభ్యులకు రిలీఫ్ లభించింది. ఈపీఎఫ్వో సభ్యులు తమ ఈపీఎఫ్ ఖాతాను ఆధార్ నంబర్తో అనుసంధానించడానికి గడువును డిసెంబర్ నెలాఖరు వరకు కేంద్రం పొడిగించింది. ఇంతకుముందు విధించిన గడువు ఆగస్టు 31తో ముగిసిపోయింది. దీంతో ఆ గడువును డిసెంబర్ వరకు పొడిగిస్తున్నట్లు ఈపీఎఫ్వో సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
ఒకవేళ మీరు డిసెంబర్ నెలాఖరు లోగా మీ ఈపీఎఫ్ ఖాతాను ఆధార్తో అనుసంధానించకుంటే మీ ఈపీఎఫ్ ఖాతాలోకి యాజమాన్య వాటా చెల్లింపులు నిలిచిపోతాయి. అంతే కాదు.. అత్యవసరాల కోసం ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదు విత్ డ్రాయల్ చేసుకోవడంలోనూ మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈపీఎఫ్వో సేవలను కూడా ఉపయోగించుకోలేరు.
మీరు ముందుగా ఈపీఎఫ్వో పోర్టల్ epfindia.gov.in.కు వెళ్లాలి. యూఏఎన్ నంబర్, పాస్వర్డ్తో లాగిన్ కావాలి. ఆ తర్వాత కేవైసీ ఆప్షన్ క్లిక్ చేసి, మేనేజ్ అన్న సెక్షన్లోకి వెళ్లాలి. అప్పుడు మీ ఈపీఎఫ్ ఖాతాతో సంబంధం ఉన్న పలు పత్రాలు కనిపిస్తుంటాయి.
తొలుత ఆధార్ ఆప్షన్ సెలెక్ట్ చేసి, మీ ఆధార్ నంబర్, దానిపై ఉన్న మీ పేరు నమోదు చేయాలి. మీరు నమోదు చేసే కేవైసీ పత్రాలు సరైనవే అయితే మీ ఈపీఎఫ్ ఖాతాతో ఆధార్ నంబర్ అనుసంధానమైనట్లే. ఈ మేరకు మీ ఆధార్ వివరాలు ధ్రువీకరించినట్లు మీకు మెసేజ్ వస్తుంది.