Jio Cinima | ఐపీఎల్ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారంతో పాపులారిటీ పొందిన జియో సినిమా (Jio Cinima)పై రిలయన్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. జియో సినిమాను అతిపెద్ద లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్గా మార్చడానికి కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం జియో సినిమా యాప్లోకి 100కి పైగా సినిమాలు, టీవీ సిరీస్లు అందుబాటులోకి తేనున్నది. దీంతో నెట్ఫ్లిక్స్, వాల్డిస్నీ వంటి గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్పామ్స్తో పోటీ పడాలని తలపోస్తున్నది. ప్రసార హక్కులు పొందిన ఐపీఎల్ మ్యాచ్లు వీక్షించే వారిపై ఎటువంటి ఫీజు చార్జీ చేయబోమని ప్రకటించిన రిలయన్స్.. సినిమాలు, సిరీస్లు వీక్షించే వారి నుంచి డబ్బు వసూలు చేయాలని సంకల్పించింది.
ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్ అనుబంధ సంస్థ వయాకాం 18 దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్లను జియో యాప్ ద్వారా ఉచితంగా ప్రేక్షకులకు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జియోతోపాటు అన్ని టెలికం నెట్ వర్క్ కస్టమర్లకు ఉచితంగా సేవలు లభిస్తుండటంతో జియో సినిమా యాప్.. వీక్షకుల పాత రికార్డులు తిరగ రాస్తున్నది. రికార్డు స్థాయిలో ఐపీఎల్ వ్యూస్ సొంతం చేసుకుంటున్నది.
ఐపీఎల్ ద్వారా జియో సినిమా యాప్కు వచ్చిన ఆదరణ కొనసాగించడానికి జియో సినిమా యాప్లో కొత్త కంటెంట్ జత చేయాలని యోచిస్తున్నట్లు రిలయన్స్ మీడియా కంటెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్ పాండే తెలిపారు. కొత్త కంటెంట్ జత చేశాక చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించామన్నారు. అయితే ఎంత చార్జీ వసూలు చేయాలన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
వచ్చేనెల 28తో ఐపీఎల్ మ్యాచ్లు ముగుస్తాయి. అప్పటికల్లా కొత్త కంటెంట్ యాడ్ చేయాలని రిలయన్స్ భావిస్తున్నట్లు జ్యోతి దేశ్ పాండే తెలిపారు. జియో సినిమా యాప్లో కొత్త కంటెంట్ మీద వీక్షకులందరికీ అందుబాటు ధరలో చార్జీ విధిస్తామన్నారు. దేశీయ సినిమాలు, వెబ్ సిరీస్ల కంటెంట్ మాత్రమే అందించాలని రిలయన్స్ భావిస్తున్నదన్నారు.