Reliance | న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఆయిల్ రిఫైనింగ్, టెలికమ్యూనికేషన్, రిటైల్ తదితర విభాగాల్లో దిగ్గజంగా ఎదిగినంత మాత్రాన తమ రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ సంతృప్తిచెందబోదని, ప్రపంచంలో టాప్ టెన్ వాణిజ్యసంస్థల్లో ఒకటిగా వృద్ధిచెందుతుందని బిలియనీర్ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ విశ్వాసం వ్యక్తం చేశారు. రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూబాయ్ అంబానీ జన్మదినమైన రిలయన్స్ ఫ్యామిలీ డే సందర్భంగా సంస్థ ఉద్యోగులను ఉద్దేశించి ముకేశ్ మాట్లాడుతూ డిజిటల్ డాటా ప్లాట్ఫామ్స్, ఏఐ అడాప్షన్లో గ్లోబల్ లీడర్స్ సరసన చేరాలని ప్రస్తుతం రిలయన్స్ లక్ష్యంగా నిర్ణయించుకున్నదని చెప్పారు. ‘ఈ కాలంలోదేశీయ, అంతర్జాతీయ వాణిజ్య వాతావరణం శరవేగంగా మారిపోతున్నది. సాధించినదానితోనే సంతృప్తిపడిపోతే సరిపోదు. ఇలా రిలయన్స్ గతంలో ఎప్పుడూ లేదు. భవిష్యత్తులోనూ ఉండదు’ అంటూ అంబానీ కుండబద్దలు కొట్టారు.
‘ఎంతో ఎత్తయిన లక్ష్యాల్ని చేరే ధైర్యాన్ని చూపించాం. కొత్త రికార్డులు సృష్టించడానికి మరింత ఎత్తుకు ఎగిరే సామర్థ్యం ఉంది..ఇలాగే రిలయన్స్ భారీ వృద్ధిని సాధించింది’ అని రిలయన్స్ చైర్మన్ చెప్పారు. ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ పరుగులు తీస్తున్న నేపథ్యంలో రిలయన్స్ ముందు అపారమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయన్నారు. ‘ప్రపంచంలో టాప్ టెన్ వాణిజ్య దిగ్గజాల్లో ఒకటిగా ఎదిగే సత్తా రిలయన్స్కు ఉంది.. సాధిస్తుంది’ అని అంబానీ ప్రకటించారు. లక్ష్య సాధన కోసం ఖాతాదారులకు ఎప్పుడూ గరిష్ఠ విలువను చేకూర్చడంపైనే దృష్టిపెట్టాలని సంస్థ ఉద్యోగులకు ఉద్భోదించారు. గతంలో ఎవరూ సృష్టించని ఉత్పత్తులు, సర్వీసుల్ని అభివృద్ధిచేయడానికి రానున్న సంవత్సరాల్లో మనం మరింత కష్టపడాలన్నారు. తన ముగ్గురు సంతానాన్ని ముకేశ్ ఉద్దేశిస్తూ రిలయన్స్ భవిష్యత్తు ఆకాశ్, ఈషా, అనంత్లు, వారి తరానికే చెందుతుందని చెప్పారు.
ముంబైలో చిన్న టెక్స్టైల్ తయారీ యూనిట్తో ప్రస్థానం ప్రారంభించిన రిలయన్స్.. అటుతర్వాత సింథటిక్ టెక్స్టైల్స్కు అవసరమైన పెట్రోకెమికల్స్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే ఆ రంగంలో దేశంలో అతిపెద్ద సంస్థగా ఎదిగింది. అటుపై పెట్రోకెమికల్స్ తయారీకి కావాల్సిన ఫీడ్స్టాక్ను అందించే దేశంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని నెలకొల్పి విజృంభించింది. తర్వాతి రోజుల్లో ప్రపంచంలోనే భారీ ఆయిల్ రిఫైనింగ్ కాంప్లెక్స్గా విస్తరించి సత్తా చాటింది. ఈ నేపథ్యంలోనే 2005లో రిటైల్ రంగంలోకి ప్రవేశించి, ప్రస్తుతం దేశంలో గ్రోసరీ స్టోర్స్, హైపర్ మార్కెట్స్, ఆన్లైన్ రిటైల్ దిగ్గజంగా వేళ్లూనుకుంది. 2016లో దేశీయ టెలికం రంగంలో సంచలనం సృష్టిస్తూ జియోను ప్రారంభించి వేగంగా దేశంలోనే నంబర్వన్ టెలికం ఆపరేటర్గా ఆవిర్భవించింది. ఇప్పుడు న్యూ ఎనర్జీ రంగంలో గిగా-స్కేల్ ఫ్యాక్టరీలను నెలకొల్పుతున్నది. ఫైనాన్షియల్ సర్వీసుల రంగంలోకి సైతం అడుగుపెట్టింది.